వైసీపీ మేనిఫెస్టో విడుదల తర్వాత మొదటి ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడిపత్రిలో జగన్కు అడగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ ప్రసంగిస్తూ మాయ మాటలతో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి వస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు మోసపూరిత హామీలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మోసాలు, కుట్రల్ని నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని జగన్ విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా వుందా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇదే కూటమి చంద్రబాబు పేరుతో సంతకం పెట్టి ముఖ్యమైన హామీలని చెప్పి మోసగించారని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసగించారని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇప్పుడు సూపర్సిక్స్ హామీల పేరుతో మరో మోసానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని జగన్ దుయ్యబట్టారు. తన పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, వాటి గురించి వివరించారు. పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వస్తున్నాయన్నారు. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే జీవితాలు ఎంత బాగుపడతాయో ఊహించుకోండి అని ఆయన పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా? అని ఆయన ప్రశ్నించారు.
గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తల పెట్టడమే అని జగన్ హెచ్చరించారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే అని ఆయన అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.