నిమ్మ‌గ‌డ్డ‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు హైకోర్టులో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌డప‌, చిత్తూరు జిల్లాల్లో మూడు చోట్ల 11 వార్డుల్లో తిరిగి నామినేష‌న్లు వేసేందుకు అవ‌కాశం ఇస్తూ నిమ్మ‌గ‌డ్డ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు నిలిపివేస్తూ తాజాగా తీర్పు వెలువ‌రించింది.

గత ఏడాది మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో  రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు.

ఈ నేప‌థ్యంలో నిన్న ఉదయం 11  నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. అలాగే గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎస్ఈసీ నిర్ణయంపై ఆయా వార్డుల్లో ఏక‌గ్రీవ‌మైన లేదా పోటీలో ఉన్న ప‌లువురు అభ్య‌ర్థులు  హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కాసేప‌టి క్రితం కీల‌క ఆదేశాలు వెలువ‌రించింది. మ‌రోసారి నామినేష‌న్లు వేసేందుకు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఆ నామినేష‌న్లు చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. రీనామినేష‌న్ వేసేందుకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.  ఇదిలా ఉండ‌గా రీనామినేష‌న్ వేసేందుకు ఎస్ఈసీ అవ‌కాశం ఇచ్చిన 11 చోట్ల‌లో కేవ‌లం నాలుగు వార్డుల్లో మాత్రమే ప్ర‌తిప‌క్షాలు తిరిగి నామినేష‌న్లు వేయ‌గ‌లిగాయి.

అలాగే వాలంటీర్ల విష‌యంలోనూ ఎస్ఈసీకి చుక్కెదురైంది. వాలంటీర్ల ట్యాబ్‌ల‌ను స్వాధీనం చేసుకోవ‌ద్ద‌ని ఆదేశించింది. రెండు అంశాల్లోనూ ఎస్ఈసీకి హైకోర్టులో ప్ర‌తికూల తీర్పులు రావ‌డం గ‌మ‌నార్హం. 

మీరు మారిపోయారు సార్‌

త‌ప్పు క‌దా..? 

Show comments