ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డి తనకు జన్మనిచ్చిన స్వగ్రామం రుణం తీర్చుకుంటున్నాడు. తుమ్మల లోకేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లె. తన ఎదుగుదలకు కారణమైన స్వగ్రామానికి సొంత ఖర్చులతో సేవ చేసేందుకు తుమ్మల ముందుకొచ్చాడు.
మొట్ట మొదటగా తుమ్మల లోకేశ్వరరెడ్డి గురించి తెలుసుకుందాం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో ఓట్ల తొలగింపుపై పెద్ద దుమారం చెలరేగిన విషయం గుర్తు ఉంటుంది. నాటి అధికార పార్టీ ప్రతిపక్ష వైసీపీ ఓట్లను తొలగిస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. ఇదే సమయంలో ఏపీలో దాదాపు 3.50 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నాటి అధికార పార్టీ టీడీపీ యాప్ 'సేవామిత్ర' లో చేర్చారు. ఈ యాప్ను హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించింది.
ప్రజల ఆధార్, ఓటర్ ఐడీల వివరాలు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. 2014 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ల జాబితాలో లేకపోవడాన్ని సామాజిక కార్యకర్త, ఇందూ ఫార్టూన్ ఫీల్డ్స్ వాసి తుమ్మల లోకేశ్వర్రెడ్డి గుర్తించాడు. అనంతరం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈయన్ను ఆంధ్రా పోలీసులు హైదరాబాద్లో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం, వైఎస్ జగన్ సీఎం కావడం చకాచకా జరిగిపోయాయి. అనంతరం సీఎం జగన్ ... సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారునిగా తుమ్మల లోకేశ్వరరెడ్డిని నియమించుకున్నాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుద్ధి చేసిన తాగునీటిని ఉచితంగా అందించేందుకు లోకేశ్ తన స్వగ్రామమైన ఉప్పరపల్లెలో రూ.7.5 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు.
అంతేకాదు లాక్డౌన్ కారణంగా గ్రామంలోని పేదలు, ఇతరత్రా ఆర్థికంగా వెనుకబడిన వెయ్యి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రూ.6 లక్షలు అందజేశాడు. దీంతో పాటు జాతీయ రహదారి నుంచి గ్రామం లోపలి వరకూ 1.2 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశాడు. తన సోదరుడు త్రిలోక్నాథ్రెడ్డి అండతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాడు. తుమ్మల లోకేశ్వరరెడ్డి సేవా కార్యక్రమాలను వైఎస్సార్ జిల్లా వాసులు ప్రశంసిస్తున్నారు.