ప్రధానమంత్రి మానస పుత్రిక నీతీఆయోగ్. దేశంలో దశాబ్దాలుగా ఉండిన ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి నరేంద్రమోడీ నీతీఆయోగ్ ను ఏర్పరిచారు. అందులోని సభ్యులు.. దేశానికి ఏం కావాలో, ఏం వద్దో డిసైడ్ చేస్తూ ఉంటారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కూడా నీతీఆయోగ్ చాలా రాజకీయమే చేసింది. పలు సార్లు నీతీఆయోగ్ ను బూచిగా చూపి .. ప్రత్యేకహోదా విషయంలో మోడీ సర్కారు మొండి చేయి చూపింది.
మరి ఆ నీతీఆయోగ్ సభ్యులు మాత్రం తమ లేకితనాన్ని చాటుకుంటూ ఉన్నారు. దాని సభ్యుల్లో ఒకరైన వీకే సారస్వత్ అనే మహనీయుడు కాశ్మీర్ లోఇంటర్నెట్ బంద్ ను సమర్థించుకోవడానికి మాట్లాడిన తీరు పరమ అసహ్యంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. వాటిని పునరుద్ధరించే ధైర్యం చేయడం లేదు మోడీ సర్కారు. ఎక్కడైతేనేం.. ఇలా నిర్బంధంతో ఎన్నాళ్లు కప్పి పుచ్చుతారు? అనేది కేంద్రం సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్ననే నీతీఆయోగ్ సభ్యుడు అయిన ఈ సారస్వత్ దగ్గర అడిగితే.. ఆయన తనదైన రీతిలో స్పందించారు.
'ఇంటర్నెట్ ఉంటే ఏం చేస్తారు.. బ్లూ ఫిల్మ్ లు చూడటం తప్ప..' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ అంటే .. బ్లూ ఫిల్మ్ లే అనే స్థాయిలో ఉంది వీరి మేధోతనం. ఇంటర్నెట్ తో అది తప్ప మరో సౌలభ్యం ఉండదని ఈ మేధావి భావించారు. తన అభిప్రాయాన్ని చెప్పారు. అందులో తప్పు లేదు. అయితే ఇలంటి వారు దేశ ప్రణాళిక సంఘంలో ఉండట ఉంది చూశారూ.. అదీ ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం.
అయినా ఇంటర్నెట్ తో బ్లూఫిల్మ్ లు చూడొచ్చని ఇది వరకూ ఒక రాష్ట్ర అసెంబ్లీలోనే నిరూపించారులే. అప్పట్లో కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ఒకే బెంచ్ లో కూర్చుని నీలి చిత్రాలు చూస్తూ వీడియోలకు ఎక్కారు. వారిని బీజేపీ క్షమించింది. ఇటీవలే ఒకరిని మంత్రిగా కూడా చేసినట్టుగా ఉన్నారు.