పగల్ షూట్..సాయంత్రం రాజకీయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈ సోమవారం నుంచే షూటింగ్ కు వస్తున్నారు. వాస్తవానికి ముందుగా వచ్చే నెల నుంచి అనుకున్నారు. కానీ మళ్లీ ఆయనే ఈనెల నుంచే డేట్ లు ఇచ్చారు. సోమవారం ఉదయం పది గంటలకు షూట్ ప్రారంభం అనుకున్నారు. కానీ వున్నట్లుండి ఇప్పుడు ఉదయం ఏడుగంటలకే మార్చారు.

విజయవాడలో పార్టీ సమావేశం వుండడంతో, తాను ఒంటి గంట వరకే వుంటానని, అందువల్ల ఉదయం ఏడు గంటలకే షూట్ కు వచ్చేస్తానని పవన్ కళ్యాణ్ నేరుగా నిర్మాత దిల్ రాజుకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒంటి వరకు షూటింగ్ చేసి, తరువాత వెళ్లి రాజకీయాలు చూసుకోవాల్సి వుందని వివరించినట్లు బోగట్టా.

ఆ మేరకు అప్పటికప్పుడు నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తమిళ సినిమాలో అజిత్ గెడ్డంతోనే నటించారు. అందువల్ల పవన్ కూడా ఈ సినిమా గెడ్డంతో చాలా సీన్లలో కనిపిస్తారు. ఆ సీన్లు అన్నీ ముందు తీస్తారు. గెడ్డం తీసేసి చేయాల్సిన సీన్లు, అలాగే డ్యూయట్ లాంటివి తరువాత ప్లాన్ చేస్తారని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మే 23న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Show comments