ఎన్టీఆర్ వార‌సులు.. ఏమిటో ఈ మాట‌లు!

ఇది వ‌ర‌కూ ప్ర‌తి యేటా ఎన్టీఆర్ వ‌ర్ధంతికి, జ‌యంతికి.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే మొక్కుబ‌డి డిమాండ్ వినిపించే వాళ్లు. ఆ మాట‌లు ప్ర‌హ‌స‌నం పాల‌య్యాయి. చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ ఉన్న సంద‌ర్భాల్లోఏపీ నుంచి అలాంటి ప్ర‌తిపాద‌న‌ను పంపే వాళ్లు కాదు. తాము కేంద్రంలో అధికార భాగ‌స్వామ్యులుగా ఉంటూ కూడా దాన్నొక డిమాండ్ గానే వినిపించే వాళ్లు. అలా ఎన్టీఆర్-భార‌త‌ర‌త్న అనేవి కామెడీకి ప‌ర్యాయ‌ప‌దాలుగా మిగిలాయి.

అయితే ఈ సారి ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ వార‌సులు ఎవ‌రూ ఆ డైలాగ్ ను వేయ‌లేదు. ఇప్పుడు వేస్తే మ‌రింత‌గా ప్ర‌హ‌స‌నం పాల‌వ్వ‌డం ఖాయ‌మ‌య్యేది. ఎందుకో ఈ సారి ఆ కామెడీ లేదు.

అయితే అంత‌క‌న్నా కామెడీ ఉంది. అదేమిటంటే.. ఎన్టీఆర్ స్వ‌ర్గాన్ని పాలించ‌డానికి వెళ్లిపోయార‌ట‌. ఈ మాట అన్న‌ది ఎన్టీఆర్ కూతుళ్ల‌లో ఒకరు, చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. త‌న తండ్రి మ‌ర‌ణం గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ ఎలాంటి ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించారో తెలుగు వారికి తెలియ‌నిది కాదు. త‌న కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు క‌లిసి త‌న‌ను ప‌ద‌వి నుంచి దించేశార‌ని ఆయ‌న వాపోయారు. తీవ్ర‌మైన క్షోభ ప‌డుతూ మాట్లాడారు. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న సంతానాన్ని తీవ్రంగా దూషించారు. త‌న నుంచి అధికారాన్ని లాక్కొని వెన్నుపోటు పొడిచార‌ని ఆయ‌న వేద‌న పడ్డారు. అలా ఎన్టీఆర్ త‌న చ‌రామాంకంలో తీవ్రంగా తిట్టింది మరెవ‌రినో కాదు.. నారా భువ‌నేశ్వ‌రి భ‌ర్త నారా చంద్ర‌బాబు నాయుడునే.

చంద్ర‌బాబుకు వెన్నుపోటు ఇమేజ్ అలాగే కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్పుడే ఆయ‌న భార్యేమో త‌న తండ్రి స్వ‌ర్గాన్ని పాలించ‌డానికి వెళ్లాడ‌ని ఇన్నేళ్ల‌కు క‌నుగొన్న‌ట్టుగా ఉన్నారు. బ‌హుశా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఏం పాలిస్తారు.. వెళ్లి స్వ‌ర్గాన్ని పాలించండి అనే  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి దించేశారేమో. వీరి మాట‌తీరు అలానే క‌దా ఉంది?

Show comments