జగన్ ప్రభుత్వ తప్పును చంద్రబాబునాయుడు సరిదిద్దారు. రైతుల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం బీమా పథకం. రైతులు పంటల బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే, మిగిలిన సొమ్మును తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం బీమా సొమ్ము చెల్లించకపోవడం వల్లే, తమ పంటలకు నష్టపరిహారం అందలేదనే ఆవేదన, ఆగ్రహం రైతుల్లో నెలకున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహాన్ని పసిగట్టిన చంద్రబాబునాయుడు... వెంటనే లోపాల్ని సవరించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాత పద్ధతిలోనే పంటల బీమా చెల్లించుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఏ పంటలకు బీమా చెల్లించుకోవాలో రైతులే నిర్ణయించుకుంటారు.
పంటల బీమా వస్తే తీసుకుంటారు. లేదంటే ఊరుకుంటారు. జగన్ ప్రభుత్వంలో అలా జరగలేదు. ఇటు రైతులను పంటల బీమా చెల్లించుకోకుండా, ప్రభుత్వ పరంగా తాము చెల్లించకుండా వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. రెండు లేదా మూడు పంటలకు రైతులు పంటల బీమా చెల్లించేవారు. ఏదో ఒక పంటకైనా లక్షల్లో బీమా సొమ్ము వచ్చేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మార్క్ గందరగోళాన్ని సృష్టించి , ఐదేళ్లలో ఒక్క పంటకు కూడా పంటల బీమా రాకుండా చేయడంలో విజయం సాధించారు.
ఇదే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలేలా చేసింది. వైసీపీ ఓటమికి దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకున్న చంద్రబాబునాయుడు... చాలా త్వరంగా పంటల బీమాపై రైతులు కోరుకున్నట్టుగా పాత పద్ధతిలోనే ఇన్స్యూరెన్స్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.