జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు పిఠాపురంలో తన గెలుపుపై ఇంకా నమ్మకం కుదరడం లేదు. టీడీపీ ఇన్చార్జ్ వర్మ భుజాలపై తన గెలుపు బాధ్యతల్ని ఆయన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన మధ్య సమన్వయం కుదరలేదని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా... జనసేన నాయకులు, కార్యకర్తల తీరుపై వర్మతో పాటు టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు.
నిజానికి పిఠాపురంలో పవన్ను గెలిపించే బాధ్యతంతా తానే చూసుకోవాలని వర్మ అనుకున్నారు. కానీ జనసేన నాయకులు, కార్యకర్తలు మాత్రం వర్మ నాయకత్వం కింద తాము పని చేయడం ఏంటనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో మనకెందుకులే అని తన పార్టీ శ్రేణులతో వర్మ అన్నట్టు పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పవన్కే ఓటు వేయాలని తాను చెప్పనని, ఎవరిష్టం వచ్చినట్టు వారు ఓటు నిర్ణయం తీసుకోవచ్చని వర్మ పరోక్షంగా టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారని సమాచారం.
ఈ విషయం తెలిసే... పవన్కల్యాణ్ ఇతరుల్ని నమ్ముకుంటే ముంచుతారనే భయాందోళన చెందుతున్నారు. అందుకే పదేపదే ఆయన పిఠాపురం చుట్టే చక్కర్లు కొడుతున్నారు. నామినేషన్ వేసే సందర్భంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తాజాగా ఇవాళ మరోసారి అదే రీతిలో ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో తన తమ్మున్ని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో విడుదల చేశారు.
ఇక బుల్లితెర, వెండితెర నటీనటులంతా పిఠాపురంలో ప్రచారం చేస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఇతర నియోజక వర్గాల్లో తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడంపై పవన్ ఎక్కువ దృష్టి పెడతారని అంతా భావించారు. కానీ పిఠాపురంలో తన గెలుపుపై ఆయన్ను అనుమానం వెంటాడుతోంది.
పిఠాపురంలో వర్మ తనకు అండగా నిలుస్తారని ఆశించినప్పటికీ, అనుకున్న స్థాయిలో నిలబడలేదనే ఆవేదన పవన్లో కనిపిస్తోంది. ముందు పిఠాపురం నుంచి తాను గట్టెక్కితే, ఆ తర్వాత ఏమైనా చూసుకోవచ్చనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు. మరీ ముఖ్యంగా జగన్ పిఠాపురానికి వెళుతుండడం పవన్ను మరింతగా భయపెడుతోంది.