ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం విశేషం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు దఫాలు విచారణకు రావాలని కోరినప్పటికీ, కేజ్రీవాల్ ఖాతరు చేయలేదు. దీంతో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఆప్ జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం నిర్వహించాల్సి వుందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్కు బెయిల్ పిటిషన్ను ఈడీ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ సీఎం, అలాగే ఆప్ జాతీయ అధ్యక్షుడు అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వడానికి కుదరదని, అతనో కేసులో నిందితుడని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ నేపథ్యంలో ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసి వుంచింది. ఇవాళ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జూన్ 1వ తేదీ వరకు ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోడానికి అనుమతి ఇచ్చింది. ఢిల్లీతో పాటు పంజాబ్లో ఆయన తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
బీజేపీకి తాను లొంగలేదనే కక్షతోనే అక్రమంగా ఈడీ కేసు నమోదు చేశారని కేజ్రీవాల్ వాపోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో తన అరెస్ట్పై ఏమైనా మాట్లాడ్తారేమో చూడాలి. ఒకవేళ నిబంధనలు ఏవైనా వుంటే, కేసు గురించి ప్రస్తావించే అవకాశం లేదు