వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, అలాగే సీబీఐ అధికారి రాంసింగ్కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తమపై పులివెందులలో నమోదైన కేసును కొట్టి వేయాలంటూ ఆ ముగ్గురు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను వేధించారని సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల కోర్టులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. విచారించిన పులివెందుల కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆ ముగ్గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా సీబీఐ అధికారిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వాలని ఎలా వేధిస్తారని, ఇదేనా విచారించే తీరు అని సీబీఐ అధికారిపై న్యాయస్థానం మండిపడింది. అనంతరం రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ వెలువరించింది.
ముగ్గురికి సంబంధించిన వేర్వేరు క్వాష్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో కేసును ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కేసు ఎదుర్కొంటారా? లేక పైకోర్టుకు వెళ్తారా? అనేది తేలాల్సి వుంది. మొత్తానికి వివేకా కేసు అనేక మలుపులు తిరుగుతోంది.