తాను రాజన్న బిడ్డనని, కడప ఎంపీగా ఆదరించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విస్తృత ప్రచారం చేశారు. ఆమె చెప్పింది విన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడింది. అధికార, కూటమి అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీని తలపిస్తోంది. దీంతో ఓటర్ల కొనుగోలులో పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల నుంచి కూడా ఓటర్లు తాయిలాలు ఆశిస్తున్నారు. కనీసం కడప పార్లమెంట్ పరిధిలో షర్మిల నిలిచిన చోటైనా, ఆమె డబ్బు ఇవ్వకపోతారా? అని ఎదురు చూడడం గమనార్హం. "రాజన్న బిడ్డనని ఊరూవాడా షర్మిల చెప్పింది. ఎన్నికలొచ్చినాయి. ఓటుకు ఆమె లెక్క ఇయ్యదా" అని కడపలో ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓట్లకు డబ్బు ఇవ్వకపోతే.. పోలింగ్ బూత్ల వైపు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు.
తాము ఓట్లు వేస్తే, గెలిచి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారని, తమకేంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాగైనా గెలవాలి, అధికారంలోకి రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయ నాయకులు ఇష్టానుసారం ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమైంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భారీ డైలాగ్లు కొట్టిన షర్మిల తనకు ఓట్లు వేయించుకునేందుకు ఎంత ఇస్తుందని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆమె ఏమీ ఇవ్వదు, ఎవరైనా ఇస్తే తీసుకుంటుందని ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతుంది. రాజన్న బిడ్డ కాబట్టి తనకు ఓటు వేయాలన్నట్టుగా ఆమె తీరు వుంది. అయితే షర్మిలకు ఎన్నికల ఖర్చుల కోసం చంద్రబాబునాయుడు లెక్క ఇచ్చారని, ఎంతోకొంత ఇస్తుందని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
ఒకవేళ షర్మిల ఓటర్లను ప్రలోభ పెట్టకపోతే మాత్రం.. అభిమానంతో ఆమెకు ఓట్లు వేసే పరిస్థితి వుండదు. ఎందుకంటే, అభిమానానికి, సేవకు ఓట్లు పడే రోజులు కాదివి. దేని లెక్కలు దానివే అని జనం బహిరంగంగానే చెబుతున్నారు మరి!