వైసీపీకి మద్దతుగా ప్రముఖ యాంకర్ శ్యామల ప్రచారం చేయడాన్ని టీడీపీ, జనసేన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ రంగానికి చెందిన పవన్కల్యాణ్కు మద్దతుగా కమెడియన్లు, ఇతరత్రా నటులు పెద్ద సంఖ్యలో పిఠాపురంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టీడీపీకి మద్దతుగా కూడా సినీ సెలబ్రిటీలు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
అదేంటో కానీ, శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయగానే ఏమై పోతామో అనే భయం ప్రత్యర్థుల్లో కలిగింది. అందుకే ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసి, మరే నటులు వైసీపీ తరపున ప్రచారం చేయకుండా భయపెట్టాలని ఎల్లో బ్యాచ్ తమ మార్క్ ట్రోలింగ్కు తెగబడింది.
ఇటీవల శ్యామల పిఠాపురంలో వంగా గీత తరపున ప్రచారం చేశారు. వంగా గీత విజయం ఎప్పుడో ఖాయమైందని ఆమె అన్నారు. తనలాంటి వాళ్లంతా కేవలం మెజార్టీ పెంచుకునేందుకే ప్రచారం చేస్తున్నట్టు ఆమె అన్నారు. దీంతో జనసేన, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు మంట పుట్టింది. వెండితెర, బుల్లితెర నటులెవరైనా తమకు తప్ప, వైసీపీకి మద్దతు ఇవ్వకూడదనేది వాళ్ల ఉద్దేశం.
ఒకవేళ ఎవరైనా పొరపాటున వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే... వ్యక్తిగత విషయాలపై లేనిపోనివి సృష్టించి భ్రష్టు పట్టిస్తామని శ్యామల ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యక్తిత్వంపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాకినాడ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్యామలపై సభ్యసమాజం సిగ్గుపడేలా ట్రోల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్యామలపై సాగుతున్న దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.