ఏపీకి కొత్త పోలీస్ బాస్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి బదిలీ నేపథ్యంలో ఏపీ సీఎస్ ముగ్గురి పేర్లను ఈసీకి ప్రతిపాదించారు. ఆ ముగ్గురిలో హరీష్కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా ఎంపిక చేయడం గమనార్హం. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
నిజానికి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారని అంతా భావించారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అత్యుత్సాహంతో ఆయన పేరును సూచించడం వల్లే పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. డీజీపీ రాజేంద్రనాథ్ను తప్పించి, ద్వారకా తిరుమలరావును నియమించాలంటూ దగ్గుబాటి పురందేశ్వరి ఏకంగా ఈసీకి సూచించారు.
దగ్గుబాటి సూచనే ఆయన నియామకానికి అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దగ్గుబాటి సూచించిన అధికారిని డీజీపీగా నియమిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయనే ఉద్దేశంతో ఈసీ జాగ్రత్త తీసుకుందని అంటున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి వైఖరే ద్వారకా తిరుమలరావుకు డీజీపీ పదవిని దూరం చేసిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.