ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు సాగనుంది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. వీరంతా ఆదివారం నుంచి మంగళవారం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయనున్నారు.
జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అయితే టీడీపీ-జనసేన మేనిఫెస్టో అనూహ్యంగా వైసీపీకి అనుకూలంగా మారినట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేన మేనిఫెస్టో అమలైతే, మూడు నెలలకు జీతాలు ఇస్తారేమో అనే భయం ఉద్యోగుల్ని వెంటాడుతోంది. కనీసం జగన్ సర్కార్ ఒకటో తేదీ కాకపోయినా, పదో తేదీ లోపైన తమకు వేతనాలు అందిస్తోందన్న సానుకూల భావన ఏర్పడింది. చంద్రబాబునాయుడు చెబుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసం రూ.1.75 లక్షల కోట్లు అవసరమని ఆర్థిక నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా ఏప్రిల్ నుంచే నాలుగు వేల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ఒకవైపు చెబుతున్న నేపథ్యంలో బడ్జెట్పై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ సరిపోక, ఇటు తమకు వేతనాలు, అలాగే ఇతరత్రా అభివృద్ధి పనులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించని వాస్తవ పరిస్థితి కళ్లెదుటే వుందని ఉద్యోగులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు, పవన్కల్యాణ్ మాయ మాటలు చెబుతున్నారని ఉద్యోగులు గ్రహించారు. మరోవైపు మేనిఫెస్టోకు ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు వుండదని బీజేపీ చెప్పడంతో కూటమి అధికారంలోకి వస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జగన్ సంక్షేమ పథకాలు అమలవుతుంటే రాష్ట్రం శ్రీలంక, వెనిజులా అవుతున్నట్టు ఇంత కాలం చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
ఉద్యోగుల్లో వచ్చిన మార్పు వైసీపీకి అనుకూలంగా మారినట్టు పోస్టల్ బ్యాలెట్ల ఎన్నికల తీరు చెబుతోంది. ఉద్యోగులు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తుండడంపై వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది. ఇదంతా కూటమి మేనిఫెస్టో పుణ్యమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు.