స్థానికుడా కాదు, ఆ ప్రాంతంతో ఏమైనా సంబంధాలున్న వ్యక్తా అంటే కాదు.. భారతీయ జనతా పార్టీలో ఆయన పని చేశారట! అలాగని ప్రత్యక్ష రాజకీయంలో కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏబీవీపీలో పని చేశాడట! ఆ తర్వాత వెంకయ్య నాయుడు కు ఏపీగా మారారట! ఆ తర్వాత వెంకయ్య చెల్లెలు కూతురును వివాహం కూడా చేసుకున్నారట! పత్రికల్లో బీజేపీ వాదంతో ఆర్టికల్స్ రాస్తూ పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడుగా పేరు పొందారు! ఇప్పుడు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి ఆయన పోటీకి దిగారు. ఈ ప్రాంతానికి అసలేమాత్రం సంబంధం లేని ఈయన అక్కడ హోరున ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.
భారీగా ఖర్చు పెట్టుకుంటూ.. వీధికో ప్రచార వాహనాన్ని దించి, పాటలు పెట్టి.. తను ఎన్నికల బరిలో ఉన్నట్టుగా రిజిస్టర్ అయితే చేసుకున్నాడు! కానీ.. ఇతడెవరో, ఇతడి నేపథ్యం ఏమిటో కూడా జనాలకు తెలియదు! అదంట, ఇదంట అని చెప్పుకోవడమే కానీ.. ఇలా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నేపథ్యం కూడా తెలియకుండా ప్రజలు ఎలా ఎన్నుకుంటారు? స్థానికులకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తం కావడంతో.. ఇతడి సొంతూరు విషయంలో కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.
ఒకరేమో ఇతడిది గుంతకల్ అని, కాదు ప్రొద్దుటూరు అని అంటారు! అలాగని అక్కడ అయిన స్థానికుడా అంటే .. అది కూడా కాదనే మాట వినిపిస్తోంది. రాయలసీమలో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కుటుంబాలు ఉంటాయి. దశాబ్దాలకు పూర్వమే అలాంటి కుటుంబాలు మహారాష్ట్ర నుంచి సీమకు వలస వచ్చి ఉంటాయి. చాలా ఊళ్లలో వీరిని మరాఠాలు అనే పిలుస్తారు! ఇంటి పేరులో కూడా మరాఠా ఉంటుంది. అయితే వీరంతా ఒక కులం కాదు.
మహారాష్ట్ర నుంచి అప్పటి పరిస్థితుల మేరకు ఇలా వచ్చిన కుటుంబాల్లో రకరకాల కులాలుంటాయి. చేతి వృత్తుల వాళ్లు, చిన్న చిన్న అంగళ్లు పెట్టకునే వారు, మిషన్ కుట్టే వాళ్లు.. ఇలా రకరకాల వాళ్లు ఉంటారు. కాలక్రమంలో వీరు స్థానిక వెనుకబడిన తరగతులతో కలిసి పోయారు. అయితే వీరిలో ఇప్పటికీ ఇంట్లో మరాఠీని మాట్లాడుకునే వాళ్లూ ఉన్నారు.
సీమలో పేరు పొందిన బొమ్మలాటలు ఆడేది కూడా ఈ మరాఠా నేపథ్యం ఉన్న వారే! జంతువల చర్మంతో తోలుబొమ్మలను తయారు చేసి ఆడతారు! ఇలా మహారాష్ట్రకు చెందిన రకరకాల కులాల వారు ఎప్పుడో సీమలో ఇలా సెటిలయ్యారు. ఈ సత్యకుమార్ ది కూడా అలాంటి నేపథ్యమే అని తెలుస్తోంది.
ప్రొద్దుటూరు ప్రాంతానికి వలస వచ్చిన ఒక మరాఠా కుటుంబానికి చెందిన వ్యక్తట ఇతడు! మదనపల్లెలో చదువుకున్నాడట! అక్కడ ఏబీవీపీలో పని చేస్తూ ఉండగా, నక్సల్స్ కూ ఏబీవీపీ మధ్యన గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్న దశలో సత్యకుమార్ కు ప్రాణభయం ఏర్పడిందట, అలాంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉంటే ఇబ్బందులు అని, వెంకయ్య నాయుడుకు ఎవరో చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లమని కోరారట! అలా సత్యకుమార్ ఢిల్లీ రైలు ఎక్కాడని అక్కడ వెంకయ్యనాయుడుకు వ్యక్తిగత సహాయకుడిగా, తన నైపుణ్యంతో రాతలతోనూ పని చేసి పెట్టాడటంతారు!
అదే సమయంలో వెంకయ్య నాయుడు చెల్లెలు కూతురు ఒకరితో ఇతడికి వివాహం కూడా అయ్యిందట! సుదీర్ఘ కాలం వెంకయ్య వద్ద పని చేసినా.. అక్కడ కూడా ఈయన విశ్వాసంతో లేడనే అంటారు! వెంకయ్యనాయుడు గుట్టుముట్లన్నీ అమిత్ షాకు మోసింది ఈ సత్యకుమారే అనే టాక్ కూడా ఉంది. అలా వెంకయ్య రహస్యాలను అటు చేరవేయడంతో ఈయన కు షా ఆశీస్సులు ఉన్నాయంటారు! ఇప్పుడు సత్యకుమార్ గెలుపు వెంకయ్య నాయుడు కూడా ఆకాంక్షించడం లేదని, ఓడిపోతే చూద్దామనే ఆకాంక్షతోనే వెంకయ్యనాయుడు ఉన్నాడనే టాక్ నడుస్తోంది! ఇక సత్యకుమార్ ఆర్థిక శక్తి ఏమిటో కానీ.. భారీగా ఖర్చులు అయితే పెట్టుకుంటున్నారట!
మొన్నటి వరకూ ధర్మవరం టీడీపీ ఇన్ చార్జిగా వ్యవహరించిన పరిటాల శ్రీరామ్ ఇప్పుడు సత్యకుమార్ కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారడంతోనే ఈ మద్దతు దక్కిందనేది స్థానికంగా వినిపిస్తున్న మాట! ఇక ధర్మవరం నుంచి బీజేపీ తరఫున అయినా టికెట్ దక్కుతుందని ఆశించిన వరదాపురం సూరి మాత్రం సత్యకుమార్ ప్రచారానికి పూర్తి దూరంగా కనిపిస్తూ ఉన్నాడు. స్థానికేతరుడు అయిన సత్యకుమార్ ఓటమి పాలైతే.. మళ్లీ అయినా తను ధర్మవరం రాజకీయాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందనేది సూరి లెక్కగా తెలుస్తోంది.
ఏతావాతా... స్థానికులు ఆయన నేపథ్యం గురించి కూడా ఏమాత్రం తెలియని వ్యక్తి, స్థానికులకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి ధర్మవరంలో పోటీలో ఉన్నాడు. దీని ఫలితం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక కులం విషయంలో కూడా సత్యకుమార్ యాదవ్ గా చెప్పుకుంటూ ఉన్నాడు! స్థానికంగా గొల్ల ఓట్లు ఏవైనా ఉంటే పొందవచ్చని, బీసీని అని ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన యాదవ్ కాదనే వాదనా వినిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వీరి కుటుంబంలో ఎవరికీ యాదవ్ అనే ఇంటి పేరు లేదు, వీరి ఇంటి పేరు అక్కడ జాదవ్ అట!
జాదవ్ అంటే.. అదేమీ యాదవ్ అనే మాటక సమానార్థకం కాదు. జాదవ్ అనేది అక్కడి గ్రామాల్లో ఒక హోదా. ఈ పేరుతో ఉత్తరాదిన ఎక్కువ మంది ఉంటారు. వారెవరూ యాదవులు కాదు, ఏకులంలో అయినా జాదవ్ అనే హోదా ఉంటుందట! యాదవ్ కు దగ్గరగా ఉందని, తన పేరు చివర యాదవ్ అని తగిలించుకుని ఈయన ప్రచారం చేసుకుంటూ ఉన్నాడని, అసలు ఈయన బీసీనే కాదని.. మదనపల్లెలో చదువుకున్నప్పుడు తన సర్టిఫికెట్స్ లో ఓసీగా రాసుకున్నాడని, ఇప్పుడు రాజకీయం కోసం బీసీనని చెప్పుకుంటూ ఉన్నాడనే వాదనా వినిపిస్తూ ఉంది!