కూటమి మేనిఫెస్టో విడుదలలో ట్విస్ట్. ప్రజాగళం పేరుతో ఎట్టకేలకు మేనిఫెస్టో విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్కు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ బిగ్షాక్ ఇచ్చారు. మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం కాకపోవడంపై అప్పుడే రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలను బీజేపీ విశ్వసించలేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కనీసం మేనిఫెస్టో ప్రతిని పట్టుకోడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఇష్టపడలేదు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా బాబు, పవన్తో పాటు బీజేపీ జాతీయ నాయకుడికి ప్రతిని ఇవ్వగా, తీసుకునేందుకు ఆయన తిరస్కరించడం గమనార్హం. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో అమలు బాధ్యత కేవలం టీడీపీ, జనసేన పార్టీలదే అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అలాగే మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆచరణకు సాధ్యం కాని హామీలున్న మేనిఫెస్టోలో భాగస్వామ్యం కావడం ఇష్టం లేకే, బీజేపీ దూరంగా వుందనే చర్చకు తెరలేచింది. మేనిఫెస్టోకు కేవలం సంఘీభావం మాత్రమే బీజేపీ జాతీయ నాయకత్వం తెలిపింది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మేనిఫెస్టో విడుదలకు దూరంగా ఉండడం గమనార్హం.
ఇంతకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్టు చంద్రబాబు అధికారం కోసం అలివి కాని హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజానీకం కూడా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరింత బలాన్ని ఇస్తోంది. పొత్తులో వుంటూ, మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పడం, అలాగే విడుదల సందర్భంగా కనీసం ప్రతిని పట్టుకోడానికి కూడా ఇష్టపడకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మేనిఫెస్టో ఎపిషోడ్ ముమ్మాటికీ టీడీపీ, జనసేనకు భారీ షాక్ అని చెప్పక తప్పదు.