టీడీపీని చూస్తుంటే జాలేస్తుంది. మిత్రపక్షమైన జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కోసం టీడీపీ పోరాటం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గాజుగ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీసింబల్గా చేర్చడంతో కూటమిలో గుబులు రేగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా ఇప్పటి వరకూ గాజు గ్లాసు గుర్తుపై స్పష్టత లేదని టీడీపీ నేతల ఫిర్యాదుతో అర్థమవుతోంది.
గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని, ఆ పార్టీ బరిలో లేని చోట ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారత సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న కోరడం గమనార్హం. ఎక్కడైనా గుర్తుపై ఆ పార్టీ విన్నపాలు చూస్తుంటారు. కానీ ఇక్కడ అంతా రివర్స్.
జనసేన గుర్తుకు సంబంధించి టీడీపీ ఎంతగా భయపడుతున్నదో ఆ పార్టీ నేతల ఫిర్యాదే నిదర్శనం. జనసేన గుర్తును ఫ్రీసింబల్గా చేర్చడం టీడీపీని కలవరపెడుతోంది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఎవరైనా స్వతంత్రులు, ఇతర రిజస్టర్ పార్టీల అభ్యర్థులు గాజుగ్లాసును ఎంచుకుంటే, నష్టపోయేది తామే అని టీడీపీ నేతలు వణికిపోతున్నారు.
టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీ ఎంత బలమైందో బహుశా ఇప్పుడు తెలిసొస్తోందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీ సింబల్గా గాజుగ్లాసును పెట్టిన తర్వాత, జనసేన పోటీలో లేని స్థానాల్లో సహజంగా ఎవరైనా ఆ గుర్తే కోరుకుంటారు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా వుంటుందో అని కూటమిలో టెన్షన్ తప్పడం లేదు.