రాత్రి కలలో దేవుడు చెప్పాడు - ఆర్జీవీ

దేవుడ్ని నమ్మని రామ్ గోపాల్ వర్మకు, రాత్రి కలలో దేవుడు కనిపించాడట. పైగా ఓ మంచి విషయం కూడా చెప్పాడట. అదేంటో ఆయన మాటల్లోనే...

"ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే.. ఈసారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు"

ఇలా దేవుడు తనకు కలలో కనిపించి చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు ఆర్జీవీ. దీనికి సంబంధించి మరో లాజిక్ ను కూడా ఆయన బయటకు తీశారు. పవన్ కు సంబంధించి గతంలో తను ఓ విషయాన్ని చెప్పానని, అది నిజమైందని.. కాబట్టి ఇది కూడా జరుగుతుందని చెబుతున్నాడు.

"ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి. ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను. నా మాటే నిజమైంది."

ఇలా తన లాజిక్ ను బయటపెట్టాడు వర్మ. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై స్పందించే వర్మ, తననుతాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా చెప్పుకుంటాడు. అలా చెప్పుకుంటూనే అతడిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటాడు. రీసెంట్ గా 'వారాహి'పై వ్యాఖ్యలు చేసిన వర్మ, ఇప్పుడిలా వెన్నుపోటు అంశాన్ని ఎత్తుకున్నాడు.

Show comments