పఠాన్ తో పోలిక.. కంగన డబ్బా మళ్లీ మొదలైంది

ఇదే నా జీవితంలో బెస్ట్ ఫిల్మ్, గతంలో ఇలాంటి సినిమా చేయలేదు, ఇకపై ఇలాంటి క్యారెక్టర్ చేస్తాననే నమ్మకం కూడా లేదు. చాలామంది డబ్బా రాయుళ్లు చెప్పే మాటలే ఇవి. ఇక నిర్మాతల విషయానికొస్తే నా జీవితంలో ఇదే ది బెస్ట్ ఫిల్మ్, ఎక్కడా రాజీ పడలేదు అని అంటుంటారు. మరికొంతమంది ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఈ సినిమా చేశాను, ఇది హిట్ అయితేనే తాము గట్టెక్కుతామని కూడా అంటుంటారు.

ఇవన్నీ స్టాక్ డైలాగ్స్. కంగనా రంగంలోకి దిగితే ఆ డబ్బా ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. తాజాగా ట్విట్టర్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి సెల్ఫ్ డబ్బా మొదలుపెట్టింది. పఠాన్ ను తిట్టడం, తన సినిమాను మోయడం.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తోంది ఇదే..

ఎందుకీ చర్చ..?

పఠాన్ సినిమాను హిందూత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కంగనా రనౌత్ కూడా పఠాన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఎంత ఎక్కువగా ఆ సినిమాను ద్వేషించారో, అంతకంటే ఎక్కువగా ఆ సినిమాకు వసూళ్లు వస్తున్నాయని మరో వర్గం ఎదురుదాడికి దిగింది. కంగనా పై కూడా కొంతమంది ట్వీట్లు వేశారు.

దీంతో కంగన రెచ్చిపోయింది. ఆ సినిమా.. పాకిస్తాన్ ని, ఐసిస్ సంస్థను పాజిటివ్ గా చూపించిందని, కానీ.. భారతీయుల్లోని మెజార్టీ హిందువులు టికెట్లు కొని ఆ సినిమాకి భారీ కలెక్షన్లు సాధించి పెట్టారని కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. పఠాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. నువ్వు జీవితాంతం సంపాదించిన ఆస్తి కంటే ఎక్కువ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.

ఈ సమాధానానికి కంగన హర్ట్ అయింది. సమాధానం ఇస్తూనే పనిలో పనిగా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంది.

ఇటీవల కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే సినిమా చేస్తోంది. అందులో ఆమె ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి నిర్మాత, దర్శకురాలు కూడా ఆమే. బీజేపీకి రాజకీయ లాభం చేకూర్చేందుకే కంగన ఈ సినిమా తీస్తున్నట్టు విమర్శలున్నాయి. ఇటీవల పార్లమెంట్ భవనంలో ఈ సినిమా షూటింగ్ కోసం పర్మిషన్ అడిగి కొత్త చర్చను లేవనెత్తింది కంగన.

ఇప్పుడు కూడా ఆ సినిమా పేరు ప్రస్తావిస్తూ ట్విట్టర్లో హడావిడి మొదలు పెట్టింది. పఠాన్ సినిమాపై విమర్శలు ఎక్కుపెడుతూనే, తన ఎమర్జెన్సీ ప్రమోషన్ మొదలు పెట్టింది కంగన. ఈ ట్వీట్లు, సమాధానాలు చూసి.. కంగన సెల్ఫ్ డబ్బా గట్టిగా వాయిస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

Show comments