జ‌గ‌న్ మొహంలో ఆనందం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొహంలో ఆనందం క‌నిపించింది. ఏపీలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని, ప‌రిశ్ర‌మ‌ల ఊసే లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ఇవాళ నంద్యాల జిల్లాలో సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించ‌డం విశేషం. కొలిమిగుండ్ల‌లో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వ స‌భ‌లో సీఎం మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహ‌ర‌ణ అన్నారు.

కొలిమిగుండ్ల‌లో ప్రారంభించిన సిమెంట్ ఫ్యాక్ట‌రీతో 1000 మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల‌ని త‌మ ప్ర‌భుత్వం చ‌ట్టం తీసుకొచ్చిన సంగ‌తిని గుర్తు చేశారు. దీంతో స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు ల‌భించాయ‌న్నారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం వ‌ల్ల ఎంతో మంచి జ‌రుగుతుంద‌న్నారు.  

కర్నూలు జిల్లాలో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామ‌న్నారు. రానున్న నాలుగేళ్ల‌లో 20వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింద‌ని ఆయన సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఈ ఘ‌న‌త  సాధ్యమైంద‌న్నారు. త‌మ‌ది ఇండస్ట్రీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సీఎం చెప్పారు.

సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు చొప్పున ప్ర‌భుత్వ‌మే లీజు చెల్లిస్తుంద‌న్నారు. అలాగే మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామ‌న్నారు. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాల‌న్నారు. ఈ విష‌య‌మై ఎమ్మెల్యేలు చొర‌వ చూపాల‌ని సీఎం కోరారు. 

Show comments