ప్చ్... వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇటీవల కాలంలో న్యాయపోరాటం కలిసి రావడం లేదు. సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటనకు వెళ్తామని, భారీ భద్రత కల్పించాలని ఆయన న్యాయ పోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు.
ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ భద్రతలో ఉన్నారని, అంతకంటే రక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించడం ఏంటని న్యాయస్థానం నిలదీసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
తన భద్రతా సిబ్బందితో పాటు తనయుడు భరత్పై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. దీంతో ఆయనకు షాక్ ఇచ్చినట్టైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడికి సంబంధించి వివాదమైన సంగతి తెలిసిందే.
ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై రఘురామ భద్రతా సిబ్బంది, తనయుడు దాడి చేశారు. ఆ ఘటనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టి వేయాలంటూ ముందుగా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ రఘురామ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. అక్కడ కూడా ఆయనకు హైకోర్టులో ఎదురైనట్టే ప్రతికూల తీర్పు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. అయితే కేసు విచారణకే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. కేసు విచారణను కొనసాగనివ్వాలంటూ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయడం గమనార్హం.