జనసేనతో వుంటే చంద్రబాబుతో వున్నట్లే

యాక్టర్ పృధ్వీరాజ్ నాలుక మడతేయలేదు. 

పాత నాలుక పీకేసి కొత్త నాలుక పెట్టుకుని మాట్లాడుతున్నారు. 

జగన్ జైజై అన్నది మరిచిపోయారు.

మెగా హీరోలను తిట్టింది మరిచిపోయారు.

మిగిలిన వారిని పక్కన పెట్టి తనకు పదవి ఇచ్చిన వైనం విస్మరించారు.

తన పదవిని తాను చేజేతులా తగులపెట్టుకున్నాననే విషయం వదిలేసారు. 

ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడితేనే కదా, రికార్డు చేసి బయటకు వదిలారు అన్నది మరచి, అలా రికార్డు చేయడమే కుట్ర అంటున్నారు. అందుకే ఇప్పుడు కొత్త నాలుక తగిలించుకున్నారు. ఇంటర్వూల మీద ఇంటర్వూలు ఇస్తూ, మళ్లీ మరోసారి తన స్టయిల్ లో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.

పాకిస్ధాన్ లో బ్రెయిన్ వాష్ చేసి, టెర్రరిస్ట్ లను తయారు చేసినట్లు తనను ఎవరో వైకాపా టెర్రరిస్ట్ గా తయారు చేసారన్నారు. ఆ మైకంలో తాను అందరి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసా అంటున్నారు. 

బహుశా ఆ మైకంలోనే ఓ మహిళతో అలా మాట్లాడేసారేమో? ఆ శిక్షణ ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అని చెప్పకుండానే తనదే తప్పు అంటున్నారు.  తను తిట్టిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నారు. 

ఇక జగన్ ను ఆయన స్టయిల్ లో అధికారమదం, ఇంకా..ఇంకా పదాలు వాడి తిట్టడం మామూలే. తాను రెడ్డి కాకపోవడం వల్లనే ఇదంతా, కాపు లంటే ఇష్టం లేదేమో అంటున్నారు. మరి కాపు అని తెలిసే కదా పదవి ఇచ్చింది అనే స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. 

అన్నింటికి మించి క్లారిటీగా ఓ విషయం చెప్పారు. జనసేనలో చేరితో చంద్రబాబుకు దగ్గర వున్నట్లే అంటున్నారు. ఇది మాత్రం పూర్తి స్పృహలో వుండే చెబుతున్నట్లున్నారు. అంటే జనసేన-తేదేపా పొత్తు మీద పృధ్వీ కి మాంచి క్లారిటీ వుందన్నమాట. 

Show comments