టాలీవుడ్ లో ఈ జాన్వి భజన ఇప్పట్లో ఆగదా..!

నిజం చెప్పాలంటే ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాదు. అలా అని అతిలోకసుందరి కూడా కాదు. ఉన్నంతలో ఆమెకు క్రేజ్ ఉందంటే ఉందంతే. ఎటొచ్చి శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ లైన్ మాత్రం జాన్వి కపూర్ కు భలేగా కలిసొచ్చింది. అందుకే టాలీవుడ్ ఆమెను నిత్యం స్మరించుకుంటోంది. నెత్తిన పెట్టుకొని మోస్తోంది. ఓ పెద్ద ప్రాజెక్టు తెరపైకొస్తే కాదు, దానికి సమాంతరంగా జాన్వి కపూర్ కూడా తెరపైకొస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడిది సర్వసాధారణం అయిపోయింది.

తాజాగా మరోసారి జాన్వి కపూర్ పేరు మారుమోగిపోతుంది. ఈసారి విశేషం ఏంటంటే.. ఏకంగా 2 సినిమాలు. వీటిలో ఒకటి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాబోతున్న జనగణమన ప్రాజెక్టు. చాన్నాళ్లుగా పూరి డెస్క్ లో ఉన్న ఈ కథ ఇప్పుడు సెట్స్ పైకి వస్తుందట. తెలుగు-హిందీ భాషల్లో తీస్తారట. ఇందులో జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకుంటారట. అలా జాన్వి భజన మళ్లీ మొదలు.

ఇదే సమయంలో మరో ప్రాజెక్టు కూడా తెరపైకొచ్చింది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న సినిమాలో జాన్వి కపూర్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం ఈ 'జాన్వి ప్రయత్నం' ఇప్పటిది కాదు. శక్తి సినిమా నుంచి ఆమెను, ఎన్టీఆర్ ను ఇలా పుకార్ల రూపంలో కలుపుతూనే ఉన్నారు.

ఇలా ఒకేసారి 2 ప్రాజెక్టులతో టాలీవుడ్ లో మరోసారి జాన్వి నామస్మరణ మారుమోగిపోతోంది. వాస్తవంగా ఆలోచిస్తే, శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ తప్ప ఆమెకు ఎలాంటి స్పెషల్ హంగు లేదు. ఆ ఒక్క ఇమేజ్ కోసం కోట్ల రూపాయలు గుమ్మరించి పిల్లను తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆ ఇమేజ్ ఏ మేరకు తెలుగులో పనిచేస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి బ్రహ్మపదార్థం. ఆమె ఒక్క సినిమా తెలుగులో చేస్తే చాలు, అప్పుడిక అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. 

Show comments