పవన్ కరుణ కోసం రత్నం-క్రిష్

సీనియర్ నిర్మాత ఎఎమ్ రత్నం, మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ ఇద్దరూ ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా పక్కన పెట్టి భీమ్లా నాయక్ సినిమాను చకచకా ఫినిష్ చేసారు. బాగానే వుంది. మరి ఇంతకీ సగంలో మిగిలిన హరి హర వీరమల్లు సినిమా సంగతేమిటి?

నెలలో కొన్ని రోజులు అటు కొన్నిరోజులు ఇటు ఇస్తారు పవన్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. భీమ్లా నాయక్ షూట్ పూర్తయిన తరువాత అయినా క్రిష్ సినిమా మీదకు వస్తారు అనుకుంటే అదీ జరగలేదు. సరైన టైమ్ లో విదేశాలకు వెళ్లారు. వచ్చే సరికి కరోనా అలుముకుంది. 

చూస్తుంటే ఏప్రిల్ వరకు పవన్ సెట్ మీదకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కానీ ఇదే సమయంలో ఆయన మరో సినిమా కమిట్ అయిపోతున్నారని వార్తలు వచ్చేసాయి. సముద్రఖని డైరక్షన్ లో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియాకు సినిమా చేయబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. 

మరి ఆ సినిమా మధ్యలో దూరితే హరిహరి వీరమల్లు పరిస్థితి ఏమిటి?  రెండున్నరేళ్లుగా పవన్ సినిమా కోసం వేచి వున్న హరీష్ శంకర్ సంగతేమిటి? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిర్మాత ఎఎమ్ రత్నం ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నారని అందుకే పవన్ ఆ సినిమాను పట్టించుకోవడం లేదని వదంతులు వున్నాయి. మరి అవెంత వరకు నిజమో తెలియదు.

మొత్తం మీద వ్యవహారం చూస్తుంటే 2023 వరకు ఆ సినిమా తెరపైకి వస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Show comments