'క‌రోనా' ఎక్స్‌గ్రేషియా ఎంతంటే...

క‌రోనాతో మృతి చెందిన కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలో కేంద్ర ప్ర‌భుత్వం తేల్చేసింది. సుప్రీంకోర్టులో ఈ విష‌య‌మై విచార‌ణ‌లో భాగంగా మోడీ స‌ర్కార్ స్ప‌ష్ట‌త ఇచ్చింది. 

క‌రోనాతో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వా ల‌ని జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ అథారిటీ గైడ్‌లైన్స్ జారీ చేసింది.

క‌రోనాతో మృతి చెందిన కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. దీనిపై విచార‌ణ‌లో భాగంగా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందేన‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. 

అయితే ఎంత ఇవ్వాల‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ ఇష్ట‌మ‌ని కోర్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఎక్స్‌గ్రేషియా గైడ్‌లైన్స్ విడుద‌ల‌య్యాయి. 

కోవిడ్ కార‌ణంగా భార‌త్‌లో అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 4,45,768 మంది చ‌నిపోయారు. వీరి కుటుంబాల‌కు ప‌రిహారాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్‌) నుంచి ఇవ్వాల‌ని రాష్ట్రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో క‌రోనా మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా విష‌య‌మై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టైంది.

Show comments