ఈ టైమ్ లో రిస్క్ అవసరమా చైతూ..!

నిన్నగాక మొన్న వచ్చిన హీరోలు (ఉదాహరణకు కిరణ్ అబ్బవరం) కూడా ఓటీటీ పై విముఖతన చూపిస్తున్నారు. తమ తొలి ప్రాధాన్యం సిల్వర్ స్క్రీన్ కే అంటూ కుండబద్దలు కొడుతున్నారు. అంతెందుకు.. మొన్నటికిమొన్న నారప్ప విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేస్తే దగ్గుబాటి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. 

చివరికి వెంకటేష్ మీడియా ముఖ్యంగా అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా చూస్తూ కూడా నాగచైతన్య రిస్క్ చేస్తున్నాడు. నేరుగా ఓటీటీలో ఓ ఒరిజినల్ మూవీ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.

నిర్మాత శరత్ మరార్, నాగచైతన్య మధ్య చర్చలు సాగుతున్నాయి. తన దగ్గరున్న టీమ్ ద్వారా చైతన్యకు 2-3 స్టోరీలు వినిపించాడు శరత్ మరార్. వాటిలోంచి ఒకటి చైతూ కన్ ఫర్మ్ చేశాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ లాక్ అయితే ఇది నేరుగా వెబ్ మూవీ రూపంలో ఓటీటీలోకి రాబోతోంది. అంటే ఇది నాగచైతన్య ఓటీటీ డెబ్యూ అన్నమాట.

సరిగ్గా ఇక్కడే అక్కినేని అభిమానులు భగ్గుమంటున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలున్నాయి. అంతోఇంతో క్రేజ్ ఉంది. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ లవ్ స్టోరీ విడుదలకు సిద్ధమైంది. ఇలాంటి టైమ్ లో ఓటీటీ వైపు చైతన్య వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు అతడి అభిమానులు. 

నాగార్జునకు థియేట్రికల్ మార్కెట్ పడిపోయింది కాబట్టి అతడు ఓటీటీకి వెళ్తున్నాడంటే సరిపెట్టుకున్నారు కానీ, చైతన్య నేరుగా ఓటీటీలో సినిమా చేస్తానంటే మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకునేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం పెద్ద హీరోలు తమ సినిమాల్ని డైరక్ట్ ఓటీటీకి ఇస్తామంటేనే ఒప్పుకోవడం లేదు. అలాంటిది నాగచైతన్య లాంటి హీరో నేరుగా ఓటీటీలో సినిమా చేస్తానంటే నిరసన తప్పకపోవచ్చు. పైగా సిల్వర్ స్క్రీన్ పై క్రేజ్ లేకపోతేనే ఓటీటీలోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తున్న వేళ.. నాగచైతన్య ఈ నిర్ణయం తీసుకోవడం ఫ్యాన్స్ కు అస్సలు నచ్చట్లేదు. 

Show comments