కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ పాండు (74) కరోనాకు బలి అయ్యారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృత్యువుతో పోరాటం సాగించారు. ఈ పోరాటంలో చివరికి మహమ్మారే గెలుపొందింది.
పాండు భార్య కుముధ కూడా కరోనాతో పోరాటం సాగిస్తున్నారు. ఆమె చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాండు దంపతులకు ముగ్గురు కుమారులున్నారు.
ఇదిలా ఉండగా బాల్యం నుంచే పాండుకు సినిమాలంటే ఇష్టాన్ని పెంచుకున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1970లో మానవన్తో నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఈ సినిమాలో పాండు విద్యార్థి పాత్రను పోషించారు. ‘కరైల్లెం షేన్బాగపూ’తో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఇందులో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్తో పాండు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కమెడియన్గా కోలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. నటనతో పాటు డిజైనింగ్లో కూడా పాండుకు మంచి ప్రవేశం ఉంది. ఆ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన.
తమిళనాడులో నిన్నమొన్నటి వరకు పదేళ్ల పాటు అధికారం చెలాయించిన అన్నా డీఎంకే రెండాకులు గుర్తును పాండునే డిజైన్ చేయడం విశేషం. అలాగే తమిళనాడు టూరిజం లోగోను కూడా ఆయనే డిజైన్ చేశారు. పాండు మృతికి పలువురు చిత్రరంగ ప్రముఖులు నివాళులర్పించారు.