తిరుపతికి ఇదే స్ట్రాటజీ

తిరుపతిలో ఉపఎన్నిక హడావుడి ముగిసింది. భాజపా సత్తా, జనసేన బలం, తెలుగుదేశం పరువు, వైకాపా ప్రతిష్ట ముడిపడిన ఎన్నిక ఇది. అందుకే ఎవరి బలం, ఎవరి ప్లానింగ్ వారు చేసుకున్నారు. వైకాపా అధికారంలో వుంది. 

ఎలాగూ ఏదో ఒక హడావుడి చేస్తుందని ముందే గ్రహించింది ప్రతిపక్ష తేదేపా. ఆ నాటకాన్ని నాటకంతోనే బయటకు తీయాలని తామే ప్లాన్ చేసి, ఉదయాన్ని విడియోలు రూపొందించి సోషల్ మీడియాలోకి వదిలారు అన్నది వైకాపా శ్రేణుల ఆరోపణ. ఈ విడియోల్లో పాత్ర ధారులు కూడా తేదేపా జనాలే అని వాళ్ల ఆరోపణ.

ఇదిలా వుంటే తిరుపతి నియోజకవర్గంలో దొంగఓట్లు అన్నది కామన్ అని అక్కడి లోకల్ లీడర్ ఒకరు చెప్పడం విశేషం. ఇక్కడ ప్రతి సారీ ఇదే స్ట్రాటజీ వుంటూ వుంటుంది. 

తిరుపతి ప్రజల అలవాటు ఏమిటంటే, అవుటర్స్ వచ్చారు అని టాక్ వినిపిస్తే చాలు ఇళ్ల నుంచి పోలింగ్ బూత్ లకు రారు. ఎవరికి అవకాశం వున్న చోట వారు గుద్దుకోవడమే అని లీడర్ వివరించారు.

ఈసారి ఫస్ట్ టైమ్ అధికార పక్షం రూపాయి డబ్బులు ఓటర్లకు ఇవ్వకపోవడం విశేషం. కానీ వాలంటీర్లకు మాత్రం పదివేల వంతున అందించినట్లు బోగట్టా. 

ఇంకా స్పెషల్ ఏమిటంటే ఎవరికి బలం వున్న చోట వారు అవతల పార్టీ పోలింగ్ ఏజెంట్ల పాస్ లను కొనుగోలు చేసేసారని బోగట్టా. వారి స్థానాల్లో తమ తమ పార్టీల ఏజెంట్లే కూర్చో పెట్టారు. దాంతో పని మరింత సులువు అయింది.

ఇలా పాస్ లు అమ్మేసుకున్నవారిలో భాజపా జనాలు ఎక్కువ వున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. అమ్ముకోలేదు. అధికారపార్టీ బెదిరించి తీసుకుంది అన్న టాక్ కూడా వుంది. మొత్తం మీద తిరుపతి ఎన్నిక అత్యంత 'పవిత్రంగా' జరిగినట్లు కనిపిస్తోంది. 

మామూలుగానే ఓడిపోయిన వారు అవతలి వారు రిగ్గింగ్ చేసారనో, దౌర్జన్యం చేసారనో అంటారు.ఇప్పుడు ముందుగానే ఆ టాక్ వచ్చేసింది. అందువల్ల ఇక ఫలితం కోసం టెన్షన్ అవసరం లేదు. వివరణ గురించి వేచి చూడాల్సిన పని లేదు.

Show comments