మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఒక తేనె తుట్టను కదిపారు. ఆమె పార్టీ పెట్టడం వల్ల ఎవరి ఓట్లు చీలుతాయి. ఎవరితో ఆమె బహిరంగంగా లేదా లోపాయకారీ పొత్తు పెట్టుకుంటారు అన్న సంగతులు అలా వుంచితే, అసలు ఆమె పార్టీ పెట్టాల్సిన అవసరాన్నే ప్రశ్నించడం మొదలుపెట్టేసారు.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి, ఎప్పటికైనా ఆ పార్టీ ని అధికారంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముందుగా గళం విప్పారు. ఎందుకంటే షర్మిల పార్టీ వల్ల ముందుగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే అన్నది అందరూ ఊహిస్తున్నదే.
సామాజిక వర్గాల లెక్కలు కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్పందన చూస్తుంటే ఆ ఊహాగానాలు నిజం అనిపిస్తోంది.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే...'' వైఎస్ కుమార్తెగా తెలంగాణలోకి వస్తే ఆడబిడ్డగా ఆదరించి, సారె, చీర పెడతామని, కష్టంతో వస్తే ఆదుకుంటామని, అంతే తప్ప అధికారం చేపట్టడానికి వస్తే అంగీకరించేది లేదని' క్లారిటీగా చెప్పేసారు.
తెలంగాణ సాధించుకున్నది తెలంగాణ జనాలు తెలంగాణనలు పాలించుకోవడానికి తప్ప వేరే వాళ్ల కోసం కాదనేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ విధంగా ఆయన అప్పుడే షర్మిల పార్టీకి ఆంధ్ర రంగు పూసే పని స్టార్ట్ చేసేసారు. ఇంకా ముందు ముందు ఎన్ని కామెంట్లు వస్తాయో చూడాలి.