చంద్రబాబుకు దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తున్న నియోజకవర్గం కుప్పం. ఆయన సొంత నియోజవకర్గం కాదిది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు అక్కడ రెండోసారే పోటీ చేసి ఓడిపోయారు. చంద్రగిరిలో పరువు పోగొట్టుకున్నాకా.. ఆయన కుప్పాన్ని ఆశ్రయించారు. అక్కడా మొదట్లో తక్కువ మెజారిటీతోనే నెగ్గారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాకా అక్కడ చంద్రబాబు మెజారిటీ పెరుగుతూ వచ్చింది.
అయితే చంద్రబాబు నాయుడు అత్యంత వ్యూహాలతో వెళ్లిన గత ఎన్నికల్లో మాత్రం కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గిపోయింది. రెండో రౌండ్ కౌంటింగ్ అయితే చంద్రబాబు నాయుడు వెనుకబడిపోయారు. ఆ తర్వాత మెజారిటీని సంపాదించినా, గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే చాలా తక్కువ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలిచారు.
ఇక వైఎస్ జగన్ సీఎం అయ్యాకా.. వెంటనే కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటూ చేయలేని పనిని జగన్ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో జయకేతనం ఎగరేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పని చేస్తోంది.
ఆ సంగతలా ఉంటే.. ఇంతలో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం పరిధిలోని అన్ని పంచాయతీల్లోనూ టీడీపీ తరఫున నామినేషన్లు వేయించడం చంద్రబాబుకు తీవ్ర తలపోటుగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
తను ఎమ్మెల్యేగా ఉన్న చోట ప్రతి పంచాయతీలోనూ కనీసం నామినేషన్లు వేయించుకోలేకపోతే చంద్రబాబు రాజకీయ పతనావస్థకు మరో నిదర్శనం ఉండదు. మలి విడత పోలింగ్ లో ఎన్నికలు జరగనున్నాయి కుప్పం పరిధిలో. ఈ నేపథ్యంలో అక్కడ నామినేషన్ లు వేయించడానికి చంద్రబాబు నాయుడు తన మాజీ సహచరుడుని హైర్ చేశారట.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆ రాజ్యసభ సభ్యుడు .. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల చేత నామినేషన్లు వేయించే పనిలో ఉన్నారట. నామినేషన్ వేస్తే చాలు.. ఒక్కో పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థికి పది లక్షల రూపాయల నజరానాను అనౌన్స్ చేసి మరీ ఇస్తున్నారట సదరు ఎంపీగారు!