సూపర్స్టార్ మహేశ్బాబు రాముడు మంచిబాలుడు అన్నట్టు, కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. సినిమా, ఫ్యామిలీ ... ఆ రెండే తన ప్రపంచం అన్నట్టుగా మహేశ్బాబు జీవితాన్ని మలుచుకున్నారు. ఏ మాత్రం తీరిక సమయం దొరికినా భార్య, పిల్లలతో సరదాగా గడుపుతుంటారు.
ఈ నేపథ్యంలో తన భార్య నమ్రత పుట్టినరోజును మహేశ్ ఎంతో ఆస్వాదిస్తుండడం విశేషం. మహేశ్ సతీమణి, హీరోయిన్ నమ్రత తన 49వ పుట్టిన రోజు నేడు జరుపుకోనున్నారు. శ్రీమతి బర్త్ డే పురస్కరించుకుని వినూత్నంగా సెలబ్రేట్ చేయాలని మహేశ్ ఒకరోజు ముందుగానే దుబాయ్ వెళ్లడం విశేషం.
వెండితెరపై జంటగా ఆకట్టుకోవడంతో పాటు ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జోడీ ఒకటి. వీరిద్దరూ ‘వంశీ’ చిత్రం కోసం మొదటిసారి కలిసి పనిచేశారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చివరికి వాళ్లిద్దరిని రియల్ లైఫ్లో కూడా ఆదర్శ జంటగా నిలిపింంది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మహేశ్-నమ్రత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్లిద్దరి ప్రేమకు ప్రతిరూపమే ఒక కొడుకు, కూతురు. కాగా మహేశ్ కంటే నమ్రత వయసులో పెద్ద కావడం గమనార్హం.
ప్రేమించి పెళ్లాడిన నమ్రతకు తాజాగా మహేశ్బాబు ట్విటర్ వేదికగా వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ ట్వీట్ ఏంటో చూద్దాం.
"ప్రతి రోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం. కాని ఈ రోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు.. ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్" అని మహేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మహేశ్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది.