టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించింది టీడీపీ నేతలే అని తేల్చి చెప్పారు. నంది విగ్రహాన్ని తొలగించడంపై బీజేపీ, దాని అనుబంధ హిందూత్వ సంస్థలే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఆ విషయంలో పోటీలు పడుతున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు తీరు దబాయింపు ధోరణిలో ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలైన చంద్రబాబు మానసిక స్థితి గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు.
ఇలాంటి వ్యక్తిని పెద్ద మనిషి అని ఎలా పిలవాలో తెలియడం లేదన్నారు. బాబు విచిత్ర ధోరణులు చూస్తుంటే ఒక్కోసారి భయమేస్తోందన్నారు. చంద్రబాబు శాడిజం ఏంటో అర్ధం కావటం లేదన్నారు.
పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబుకు 41 సీఆర్పీసీ నోటీసు గురించి అవగాహన లేదా? అని నిలదీశారు. ఎక్కడైనా విగ్రహాలను ఎవరైనా రాజకీయ నాయకులు తీసుకెళ్తారా? చంద్రబాబుకు ఎందుకింత ఆవేశం, ఫ్రస్ట్రేషన్? అని సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు.
చిన్నపిల్లల మాటల కంటే అధ్వానంగా చంద్రబాబు మాటలున్నాయని దెప్పి పొడిచారు. సీఎం జగన్ను టార్గెట్ చేయడమే చంద్రబాబు ఏకైక లక్ష్యమని సజ్జల అన్నారు. నిన్న టీడీపీ నేత కళా వెంకట్రావును అరెస్ట్ చేయకుండానే, ఏదో చేశారని నానాయాగీ చేశారని దుయ్యబట్టారు.
పోలీసులు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారని, దాన్ని చంద్రబాబు సీన్ క్రియేట్ చేశారని విమర్శించారు. ఇందులో చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
చంద్రబాబు రాజకీయంగా పతనం అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు.