జగన్ మార్క్: మరో విప్లవానికి నేడే ముందడుగు

పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పటికే విప్లవాత్మక పద్ధతులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు రేషన్ సరుకుల పంపిణీ విషయంలో కూడా మరో సంచలనానికి తెరతీశారు. 

ఇంటింటికి రేషన్ బియ్యం అందిస్తానని మాటిచ్చిన ముఖ్యమంత్రి.. చెప్పినట్టుగానే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి అత్యంత కీలకమైన రేషన్ సరుకుల సరఫరా వాహనాల్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 9260 వాహనాల్ని సిద్ధం చేశారు. ఈ వాహనాలన్నీ ఈరోజు ఆయా జిల్లాల్లో ప్రారంభమౌతాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వాహనాల్ని మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో ఆయా మంత్రులు ఈ వాహనాల్ని ప్రారంభిస్తారు.

ఈ వాహనాలు కొనుగోలుతో కూడా ఉగ్యోగాలు కల్పించారు జగన్. ప్రతి వాహనదారుడు (మొబైల్ ఆపరేటర్) ఉద్యోగస్తుడిగా మారాడు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రివర్స్ టెండరింగ్ విధానంలో ఈ వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా  దానికి రాయితీ కూడా అందించింది ప్రభుత్వం. తద్వారా వేల ఉద్యోగాలు కల్పించింది.

ఈ సంగతి అటుంచితే  ఇకపై రోజువారీ కూలీలు రేషన్ కోసం తమ రోజు కూలీని కోల్పోవాల్సిన పరిస్థితి ఉండదు. ఒకప్పుడు రేషన్ డిపో ముందు గంటల కొద్దీ క్యూలో నిల్చునే కూలీలు, ఆరోజు ఉపాధి కోల్పోయేవారు. 

ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఇంటికే బియ్యం సరఫరా చేస్తారు. అంతేకాదు  మన కళ్ల ముందే బియ్యం నాణ్యతను, బరువును మనం పరీక్షించుకోవచ్చు. దానికి సంబంధించిన యంత్రాలన్నీ వాహనంలోనే ఉంటాయి. ఇలా రేషన్ లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చారు జగన్.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకాబోతున్న ఈ విధానానికి సంబంధించి రేపట్నుంచి అన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ మొదలుకాబోతోంది. 

వాహనాల డ్రైవర్లు స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎలా సమన్యయం చేసుకోవాలనే అంశంతో పాటు  ఉదయం 9 గంటల్లోపే బియ్యాన్ని ఇంటింటికి ఎలా చేరవేయాలనే అంశంపై కసరత్తు చేస్తారు. ప్రతి రోజు సగటున 90 కార్డులకు బియ్యం మంజూరు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ట్రయల్ రన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

రేషన్ బియ్యం అంటే తినడానికి పనికిరాదనే అపవాదు ఉంది. దీన్ని పూర్తిగా తొలిగించబోతున్నారు ముఖ్యమంత్రి. స్వర్ణ రకానికి చెందిన మంచి బియ్యాన్ని అందించబోతున్నారు. నూకలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ పథకాల్ని ఇంటి గడప వద్దకే తీసుకొస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన జగన్.. ఇచ్చిన మాట ప్రకారం.. ఇప్పటికే ఎన్నో పథకాల్ని ముంగిట్లోకి తీసుకొచ్చారు. సంక్షేమ ఫలాల్ని అందించారు. ఇప్పుడు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని కూడా ఇంటి గడప వద్దకు చేరుస్తున్నారు. సో.. ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లతో పాటు రేషన్ పండగకు ప్రజలంతా సిద్ధంకండి. 

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

Show comments