‘ఒక్కడు’ సినిమా నిర్మాత ఎమ్ఎస్ రాజు హర్ట్ అయ్యాడు. తాను మనస్తాపానికి గురి కావడానికి కారణమైన సూపర్స్టార్ మహేశ్బాబు భార్య, సినీ సెలబ్రిటీ నమ్రతపై సదరు నిర్మాత ఆమె పేరుకు తగ్గట్టే ట్వీటర్ వేదికగా స్పందించడం విశేషం. అసలేం జరిగిందంటే...
ప్రిన్స్ మహేశ్ నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై నిన్నటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేశ్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్లో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికర పోస్టు చేశారు.
‘మహేష్ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్ హిట్. మళ్లీ మళ్లీ చూడాలనించే సినిమా. ఒక్కడు నాకు ఆల్టైమ్ ఫేవరెట్’ అని నమ్రతా పేర్కొన్నారు. ఇంత వరకూ పరిమితమై ఉంటే ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చేది కాదు. ఎవరి మనసులు నొచ్చుకునేవి కావు. ఆ తర్వాత ప్రస్తావనే నిర్మాత హర్ట్ కావడానికి కారణమైంది.
చిత్రయూనిట్ సభ్యులైన మహేశ్, భూమిక, గుణశేఖర్, ప్రకాశ్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించారు. వీరిలో అతి ముఖ్యమైన వ్యక్తి అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు పేరు మిస్ అయింది. సినిమా తెరకెక్క డానికి , తెర వెనక మూలకారకులు నిర్మాతలనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది తనకు ఆల్టైమ్ ఫేవరెట్గా చెప్పుకునే ఒక్కడు సినిమా నిర్మాతను నమ్రత మరిచిపోవడం గమనార్హం.
నమ్రత పోస్టుపై నిర్మాత ఎమ్ఎస్ రాజు కూడా ఆసక్తికర, వ్యంగ్య ధోరణిలో ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజు ట్వీట్ ఎలా సాగిందంటే
‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు పేవరెట్ మూవీ అయినందుకు. గుడ్లక్’ అంటూ ట్వీట్ చేసి మహేశ్ను ట్యాగ్ చేయడం గమనార్హం.
నిర్మాత ట్వీట్పై నెటిజన్లు స్పందించారు. మీరు లేకుండా ఒక్కడు సినిమాను అసలు ఊహించలేం. అలాంటిది మీ పేరు ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది సార్ ...అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నమ్రత సోషల్ మీడియా పోస్టు నిర్మాతను హర్ట్ చేసిందన్నది వాస్తవం.