కేటీఆర్‌కు సవాల్ గ్రేటర్ ఎన్నికలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్ ఒకటిన జరిగే ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. 2023లో జరిగే అసెంబ్లీ సాదారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని టీఆర్‌ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. 

దానికి తోడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎదురైన షాక్ నుంచి కోలుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఆ పార్టీ వినియోగించుకుంటోంది. అయితే గత కార్పొరేషన్ ఎన్నికలలో మాదిరి టీిఆర్‌ఎస్‌కు ఈసారి అంత సానుకూల వాతావరణం ఉంటుందా అన్నది పెద్ద చర్చగా ఉంది.

మేయర్ పీఠం వరకు టీఆర్‌ఎస్ ఏదో విధంగా కైవసం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాని అసలు సవాలు వారు చెబుతున్నట్లు ఈసారి వంద డివిజన్‌లలో గెలవగలగాలి. లేకుంటే అధికార పార్టీ ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కుంటోందన్న సంకేతం వెళుతుంది.

ఈ ఎన్నికలు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. కాబోయే ముఖ్యమంత్రి  కేటిఆర్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో ఆయన పార్టీని విజయతీరాలకు నడిపించలసి ఉంటుంది. అది కూడా గతసారి వచ్చిన ఫలితాలకు తక్కువ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది.

2016లో ఉన్న రాజకీయ పరిస్థితికి, ఇప్పటికీ కొంత తేడా ఉన్నమాట వాస్తవం. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలలో పట్టు ఉందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాని, మంత్రి కేటిఆర్ కాని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు.

ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పూర్తిగా తయారు అవడానికి అవకాశం లేకుండా ఎన్నికలను కాస్త ముందే పెట్టేస్తున్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరిని డివిజన్‌లలో పనిచేయడానికి కేటాయించారు.

మరో వైపు ఇటీవలి వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు పదివేల రూపాయల చొప్పున సాయం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించి, చకచకా పంపిణీ ఆరంభించారు. అయితే ఈ సాయం అందలేదంటూ వస్తున్న నిరసనలు కాస్త చికాకు పెడుతున్నాయి.

టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ విషయంలో పెత్తనం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వరదబాధితులు పెద్ద సంఖ్యలో మీ సేవ సెంటర్లలో ఈ సాయం కోసం క్యూలలో ఉంటున్నారు. ఇదేదో తలనొప్పిగా మారుతోందని గమనించిన ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ పేరుతో సాయం పంపిణీ నిలిపివేసింది.

ఎన్నికల తర్వాత ఆ డబ్బు పంపిణీ జరుగుతుందని ప్రకటించింది. బీజేపీ వారే ఈ సాయం పంపిణీ కాకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్  ఆరోపించడం, దానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి.  

ఇక ఆశ్చర్యం కలిగించేలా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మున్సిపాల్టీలలో ఇంటి పన్నును 50 శాతం తగ్గించారు. ఏడాది పదిహేను వేల రూపాయల లోపు వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. నిజానికి ఈ కేటగిరిలోనే అత్యధికంగా ఇళ్లు ఉంటాయి.

నిజానికి ఎప్పుడో నిర్ణయించిన ఆస్తి పన్నును నగరంలో ఈసారి  సవరిస్తారని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. తద్వారా హైదరాబాద్‌లో ఆర్థిక వనరులు పెంపొందించుకుంటారని భావించారు. అలా చేయకపోగా ఆస్తి పన్నులో సగమే ఈ ఏడాది చెల్లించవచ్చని ప్రకటించడం ద్వారా పెద్ద తాయిలాన్ని టీఆర్‌ఎస్ ఇస్తోందని చెప్పవచ్చు.

అలాగే డ్బ్బైఐదు గజాల స్థలం ఉన్నవారు భవన నిర్మాణ అనుమతి తీసుకోనవసరం లేదని, 600 గజాల స్థలంలోపు వారు స్వీయ దవీకరణ చేసి నిర్మాణ అనుమతి తీసుకోవచ్చని కూడా కేటిఆర్ ప్రకటించారు. ఇవన్ని ఆచరణలో ఎలాంటి రూపం తీసుకుంటాయో చెప్పలేం. తాయిలాలు ఇస్తున్న తీరు చూస్తే టీఆర్‌ఎస్ పార్టీలో ఈ ఎన్నికలపై కొంత గుబులు కూడా ఉందన్న విశ్లేషణలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.

ఇటీవలి వరదల వల్ల వందలాది కాలనీలలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అసాధారణ వర్షాలు కురిసిన మాట నిజమే అయినా, కాలనీలలో జనజీవనం ఎప్పటిమాదిరిగా సాగడానికి ప్రభుత్వ పరంగా ఎంత చేసినా సరిపోని పరిస్థితి ఏర్పడింది.

దీనివల్ల ప్రజలలో కొంత అసంతప్తి ఏర్పడిందన్న అభిప్రాయం ఉంది. దానిని పొగొట్టడానికా అన్నట్లు కేసీఆర్ ఒక్కో ఇంటికి పదివేల సాయం ప్రకటించి డబ్బు విడుదల చేశారు. ఈ సొమ్ము అందరికి సజావుగా పంపిణీ అయితే ఫర్వాలేదు. లేకుంటే అది కూడా అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేటిఆర్ అనేక వాగ్దానాలు చేశారు. ఉదాహరణకు కేబీఆర్ పార్కు చుట్టూరా ప్లై ఓవర్లు వస్తాయని, హడావుడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. కాని అవి రాలేదు. అయితే దుర్గమ్మ చెరువు పై నిర్మించిన వంతెన వరకు టీఆర్‌ఎస్ క్రెడిట్ తీసుకోవచ్చు. అలాగే ఎల్బినగర్ వద్ద నిర్మించిన వంతెనలు కూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వస్తాయి. కాని అవి పూర్తిస్థాయి గెలుపునకు సరిపోతాయా అన్నది చెప్పలేం.

అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లక్ష నిర్మించి పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా పూర్తిగా సాధ్యపడలేదు. 201లో శాసనసభ ఎన్నికలలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ, ఈసారి అంత సానుకూల పరిస్థితి ఉండవకపోవచ్చని దుబ్బాక ఫలితం వెల్లడించింది.

దానికి తోడు కాంగ్రెస్ కన్నా దూకుడుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్‌లో ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను వెతిక్కునే లోపే టీఆర్‌ఎస్ వేగంగా తన అభ్యర్దులను సిద్ధం చేసుకుంది.

అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే టీఆర్‌ఎస్‌కు ఏభైలోపు వచ్చినా నామినేటెడ్ సభ్యులతో పాటు, మజ్లిస్‌తో కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చు. కాని గత ఎన్నికలలో కన్నా తక్కువ డివిజన్‌లలో గెలిస్తే, అది పార్టీకి అప్రతిష్టగా మారుతుంది.

దాని ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుంది. అందువల్లే టీఆర్‌ఎస్ నేతలు కాని, మంత్రి కేటిఆర్ కాని ఈ ఎన్నికలలో వంద సీట్ల టార్గెట్‌తో పనిచేయడానికి సమాయత్తం అయ్యారు.

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు వల్ల టీఆర్‌ఎస్‌కు కొంత అప్రతిష్ట వచ్చినట్లయింది. గత ఆరేళ్లలో తొలిసారి ఒక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడినట్లయింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ నాలుగు ఎమ్.పి సీట్లు, కాంగ్రెస్ మూడు ఎమ్.పి. సీట్లు గెలుచుకోవడం కూడా టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా నష్టం జరిగింది.

వీటన్నిటిని కవర్ చేసుకోవాలంటే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించవలసి ఉంటుంది. గతసారి మాదిరే ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ అలా విజయం సాధిస్తే, కేటిఆర్ తిరుగులేని నేతగా ప్రజలలోను, పార్టీలోను నిలబడతారు.

అలాకాకుండా గణనీయంగా సీట్లు తగ్గితే మాత్రం కేటిఆర్‌కు కూడా కాస్త చికాకుగానే ఉంటుంది. తెలంగాణలో మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఒక ఎత్తు అని చెప్పాలి.

ఈ ఎన్నికపై దేశ వ్యాప్తంగా దష్టి పడే అవకాశం ఉంటుంది. అందులోను బీజేపీ చాలా సీరియస్‌గా రంగంలో దిగుతుంది. కేంద్ర ెం మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన భూపేంద్ర యాదవ్‌ను హైదరాబాద్ ఎన్నికల ఇన్‌చార్జీగా పెట్టారని సమాచారం వచ్చింది.

అంతేకాక కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రముఖులను బీజేపీలోకి ఆకర్షిస్తున్నారు. టీఆర్‌ఎస్ కూడా ఆయా చోట్ల కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరిని ఆకర్షించవచ్చు. బీజేపీ హైదరాబాద్‌లో గణనీయంగా ముప్పై నుంచి నలభైఐ  సీట్లు సాధిస్తే వచ్చే శాసనసభ ఎన్నికలకు తామే చాంపియన్‌లమంటూ సవాలు విసిరే స్థాయిలో మాట్లాడతారు. అలాకాకుండా కేవలం పదిలోపే డివిజన్‌లకు బీజేపీ పరిమితం అయితే ఆ పార్టీ ఉత్సాహం పై నీళ్లు చల్లినట్లు అవుతుంది. 

ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే పోటీ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య కేంద్రీకతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి నగరంలో గట్టి నేతలు లేని పరిస్థితి. అంతా కలిసి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కుంటున్నామన్న నమ్మకం కల్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలం అవుతున్నారు.

దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడం కూడా ఆ పార్టీకి తీరని నష్టం చేసింది. ఈ నేపథ్యంలో  బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ డివిజన్‌లలో గెలవగలిగితే తప్ప ఆ పార్టీకి రాజకీయంగా కష్టాలు తప్పవు.

ఏతావాతా చెప్పాలంటే 2023లో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు ఇది ఒక సెమిఫైనల్ వంటి ఎన్నికలని చెప్పాలి. టీఆర్‌ఎస్‌కు ఉన్న స్థానాలు నిలబెట్టుకోవడం ఒక సవాలు అయితే, బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో తామే ప్రత్యామ్నామ్నాయని రుజువు చేసుకోవడానికి ఈ ఎన్నికలలో ఎక్కువ డివిజన్‌లలో గలవడం అత్యవసరం.

మజ్లిస్ సంబంధించినంతవరకు పాత బస్తీలో వారికి ఎదురులేని పరిస్థితి కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌కు వచ్చే సీట్లను బట్టి వారి అవసరం పై ఆధారపడే పరిస్థితి వస్తుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments