ఆటలో అరటిపండు.. కూరలో కరివేపాకు

గ్రేటర్ పోరు కేవలం టీఆర్ఎస్,-బీజేపీ మధ్యే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం ఎవరికీ పోటీ కాదు, ఎంఐఎంతో ఎవరూ పోటీ పడలేరు కాబట్టి.. వారిది ప్రత్యేకం. 

ఇక కాంగ్రెస్, టీడీపీ ఆటలో అరటిపండుల్లా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసింది. తెలంగాణ ఇచ్చిందన్న పేరు కూడా కాంగ్రెస్ కి తుడిచిపెట్టుకుపోయింది.

ఇక టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కనీసం టీడీపీ జెండా బొమ్మ కూడా తెలంగాణ వార్తల్లో కనిపించడం లేదంటే దారుణ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం టీడీపీ అనుకూల మీడియా మాత్రమే ఆ పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుంది. 

టీడీపీ అభ్యర్థుల జాబితా, నామినేషన్ల వ్యవహారం ఎవరికీ పట్టడం లేదు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మాత్రమే గ్రేటర్ లో టీడీపీకి ఉన్న ఏకైక ఆకర్షణ.

అన్నిటికంటే మించిన దారుణం ఏంటంటే.. తెలంగాణ టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిన మాటల్ని తెలంగాణ టీడీపీ సోషల్ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంటోంది. 

మహానాడు వేదికపై నాడు చంద్రబాబుని ప్రశంసిస్తూ తలసాని అన్న మాటలే ఇప్పుడు తెలంగాణ టీడీపీకి దిక్కుగా మారాయి. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీ నాయకులెవరికీ గ్రేటర్ పై ఆశలేదు. 

అందుకే చంద్రబాబు కూడా రోజూ ఏపీ నాయకులతో జూమ్ లో సమావేశమవుతున్నా.. ఒక్క ముక్క కూడా గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడ్డంలేదు. అధికార పార్టీపై ఓ విమర్శ లేదు, కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేదు. అంటే పూర్తిగా చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను పట్టించుకోవడంలేదని అర్థమవుతోంది. 

ఒకరకంగా తెలంగాణ ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడ్డం అక్కడి అభ్యర్థులకు నష్టమే కానీ, లాభం ఎంతమాత్రం కాదు. అందుకే వారు కూడా తమ తరపున ఎవరూ మాట్లాడకపోయినా పర్లేదు, సొంతంగా ప్రచారం చేసుకుంటామని చెబుతున్నారు.

పొరపాటున చంద్రబాబు ఏదైనా మాట్లాడితే, దానికి టీఆర్ఎస్ పెడర్థాలు తీస్తే.. మొదటికే మోసం వస్తుందనేది టీడీపీ అభ్యర్థుల భావన. దీంతో తెలంగాణకు చెందిన నేతలు గతంలో చంద్రబాబుని, టీడీపీని పొగిడిన వీడియోల్ని బైటకు తీసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం వారు పార్టీలు మారినా కూడా.. చివరికి వారి ప్రసంగాలే తెలంగాణ టీడీపీ నేతలకు దిక్కయ్యాయి. అటు చంద్రబాబుకు కూడా తను ఎక్కడ మాట్లాడితే ఓటుకు నోటు కేసు తెరపైకి వస్తుందేమోనన్న భయం ఉంది. దీంతో గ్రేటర్ ఎన్నికల బరిలో టీడీపీ ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు పాత్రలు పోషిస్తోంది.

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను 

Show comments