ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. జగన్ తీసుకునే నిర్ణయం బట్టి లోకేశ్ పంథా ఏమిటో తేలిపోతుంది. చంద్రబాబు తనయుడు, టీడీపీ ఆశా కిరణం లోకేశ్ కొన్ని రోజులుగా యాక్టీవ్ అయ్యారు. ట్విటర్కు గబ్బిలం మాదిరిగా వేలాడుతూ కనిపించిన లోకేశుడు ...ప్రస్తుతం నేలదిగి లోకంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేకపోవడం, దానికి తోడు చంద్రబాబునాయుడి వయసు 70కి పైన ఉన్న నేపథ్యంలో ... ఆయన జనంలోకి రాలేని పరిస్థితి. దీంతో లోకేశ్ జనంలోకి వెళుతున్నారు. లోకేశ్లో అనూహ్యమైన మార్పు టీడీపీ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. వర్షాలతో నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకోడానికి అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో శుక్రవారం లోకేశ్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బోర్లకు మీటర్లు వద్దని రైతులు వేడుకుంటున్నారని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే అనంతపురం నుంచే రైతు ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు.
లోకేశ్ హెచ్చరికతో బోర్లకు మీటర్లు పెట్టకుండా జగన్ సర్కార్ వెనకడుగు వేస్తుందా? లేక ముందుకే వెళుతుందా? అని తేలాల్సి ఉంది. ఒకవేళ జగన్ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే మాత్రం అనంతపురం నుంచి లోకేశ్ ఉద్యమం స్టార్ట్ చేస్తారన్న మాట. అంటే లోకేశ్ను ఉద్యమ నాయకుడిగా జగన్ సర్కార్ తయారు చేస్తుందన్న మాట.
ట్విటర్తో ఆడుతూ పాడుతూ గడిపే యువకిశోరాన్ని ఒక్కసారిగా రైతు ఉద్యమ నాయకుడిగా జగన్ సర్కార్ నిర్ణయం తీర్చిదిద్దనున్నదని అర్థం చేసుకోవాలి. తండ్రి చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేస్తారన్న మాట. అందేకే జగన్ చేతిలో లోకేశ్ భవిష్యత్ అని చెప్పడం!