సంచ‌ల‌న అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడి అరెస్ట్‌

త‌న‌పై 139 మంది వేలాది ద‌ఫాలు అత్యాచారం చేశార‌ని ఓ యువ‌తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన కేసులో ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాన నిందితుడైన రాజ‌శ్రీ‌క‌ర్‌రెడ్డి అలియాస్ డాల‌ర్‌బాయ్‌ను హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. బాధిత యువ‌తి మొద‌ట్లో త‌న‌పై ప‌లువురు సినీ, టీవీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు, ప‌లు యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చి క‌న్నీటిప‌ర్యంత‌మైంది. ఈ యువ‌తి ఆరోపించిన ప్ర‌ముఖుల్లో బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్‌, సినీ న‌టుడు కృష్ణుడు త‌దిత‌రులున్నారు. ఆ త‌ర్వాత రెండురోజుల‌కే బాధిత యువ‌తి యూట‌ర్న్ తీసుకుంది. డాల‌ర్ బాయ్ బెదిరించ‌డంతో ప్ర‌ముఖుల పేర్లు చెప్పాల్సి వ‌చ్చింద‌ని, వారెవ‌రూ త‌న‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ‌లేద‌ని చెప్పుకొచ్చింది. దీంతో కేసు తుస్సుమ‌ని నీరుగారిపోయింది.

ఈ నేప‌థ్యంలో పంజాగుట్ట పోలీసులు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు కోసం కేసును సీసీఎస్‌కు బ‌దిలీ చేశారు. ప‌రారీలో ఉన్న ప్ర‌ధాన నిందితుడు రాజ‌శ్రీ‌క‌ర్‌రెడ్డి అలియాస్ డాల‌ర్ బాయ్‌ను గోవాలో అరెస్ట్ చేసి న‌గారినికి తీసుకొచ్చారు. అనంత‌రం నాంప‌ల్లికోర్టులో శుక్ర‌వారం హాజ‌రుప‌రిచారు.

డాలర్ బాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తాజా ఫిర్యాదులో పేర్కొనడం గ‌మ‌నార్హం.  యువతి వాంగ్మూలం ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు ప్ర‌ధాన నిందితుడిని క‌స్ట‌డీలోకి తీసుకునే అవ‌కాశం ఉంది. 

Show comments