1983లో టీడీపీ అధికారంలోకి రావడంలో ఈనాడు క్రియాశీలక పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకునే క్రమంలో జర్నలిజం విలువలను పక్కన బెట్టి ఎన్టీఆర్కు రామోజీ గట్టి మద్దతుదారుడిగా నిలిచారు.
ఎన్టీఆర్ కోసం తాను అన్ని విలువలను త్యజించినా ... చివరికి తనకా గౌరవం ఇవ్వలేదనే కోపం, కసి రామోజీలో అంతకంతకూ పెరిగాయి. 1995లో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో ఈనాడు పాత్ర తక్కువేం కాదు. అందుకే రామోజీని రాజ గురువుగా, కుల గురువుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాధిస్తారు. మరి అలాంటి భక్తుడు, శిష్యుడి కోసం కుల గురువు ఏం చేయడానికైనా వెనుకాడరని .... రామోజీ గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతారు.
అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే కొనసాగించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో టీడీపీ ఆర్థిక మూలాలు కూకటి వేళ్లతో సహా పెకలించినట్టయింది. దీంతో చంద్రబాబు సహా రాజధాని ప్రాంతంలో భూములున్న, కొనుగోలు చేసిన కమ్మ సామాజిక ధనవంతులకు భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. దీంతో ఎలాగైనా రాజధానిని నిలుపుకోవాలనే పట్టుదల చంద్రబాబుతో పాటు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్న ఎల్లో మీడియాకు అంతకంతకూ పెరుగుతోంది.
అమరావతిలోనే రాజధాని కొనసాగాలనే తమ వాదన లేదా డిమాండ్ను బలపరిచే గళాలను వినిపించేందుకు ఎల్లో మీడియా ఓ తపస్పులా చేస్తోంది. ఈ క్రమంలో ఈనాడు ప్రతిరోజూ ఏదో రకంగా అమరావతికి అనుకూలమైన కథనాలను వండి వార్చుతోంది.
ఈ క్రమంలో ఈనాడు ట్రాప్లో జనసేనాని పవన్కల్యాణ్, తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పడ్డారని ... వాళ్ల ఇంటర్వ్యూ విశేషాలు చదివిన వారికి అర్థమవుతుంది. టీడీపీ వ్యూహంలో భాగంగా ఎల్లో మీడియా పక్కా ఎజెండాతో వాళ్లిద్దర్నీ ఇంటర్వ్యూ చేయడాన్ని గమనించవచ్చు.
తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న పురందేశ్వరి తమ పార్టీ బలోపేతం చేసేందుకు ఇంటర్వ్యూను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ... టీడీపీ , ఆ పార్టీని భుజాన మోసే ఈనాడు పాలసీకి అనుగుణంగా సమాధానాలు ఇవ్వడం వల్లే సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ నెల 20వ తేదీన జనసేనాని పవన్కల్యాణ్ ఇంటర్వ్యూను ఈనాడు ప్రచురించింది. ‘మూడు రాజధానులు నమ్మక ద్రోహమే’ అంటూ ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఘాటైన విమర్శ చేశారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ వెల్లడించిన కొన్ని అభిప్రాయాలను తెలుసుకుందాం.
‘అమరావతి సమస్యను 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. నిజానికిది రాష్ట్రం మొత్తం బాధ. ఈ పోరాటం మరింత బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి. సమస్యను సమర్థంగా అందరిలోకి తీసుకెళ్లటం లేదు. అవరావతిపై జరుగుతున్న వ్యతిరేక వాదనల్ని తిప్పికొట్టడం లేదు. బెంగాల్లోని సింగూరు సమస్య దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందంటే కారణం ... దాన్ని సమర్థంగా అందరికీ అర్థమయ్యేలా చేశారు. అమరావతికీ అదే కార్యాచరణ ఉండాలి’
అమరావతికి ప్రజల నుంచి మద్దతు లేదని పవన్ మాటల్లో స్పష్టమైంది. పశ్చిమబెంగాల్లోని సింగూరు సమస్య దేశ వ్యాప్తంగా ఆకర్షించిందని, దానికి కారణం దాని గురించి అందరికీ అర్థమయ్యేలా చేయడమే అని పవన్ సెలవిచ్చారు. కానీ అమరావతి విషయంలో సమర్థవంతంగా అర్థం అయ్యేలా చేయలేకపోయారని పవన్ ఆవేదన. ఇప్పుడు అందరికీ అన్నీ అర్థమవుతున్నా యని పవన్ గుర్తించకపోవడం ఆయన రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తోంది.
రాష్ట్ర ప్రజలందరూ అమరావతి గురించి బాగా అర్థం చేసుకోవడం వల్లే ... మద్దతు పలకకుండా మౌనం దాల్చారు. కానీ పవన్ మాత్రం ఇంకా ఏదో అర్థమయ్యేలా చేయాలంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా పవన్ ఆ 29 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నెగెటివ్ అయ్యారు. తమ ప్రాంత ఆకాంక్షలను పవన్ పరిగణలోకి తీసుకోలేదనే ఆగ్రహం మిగిలిన ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అది ప్రతిబింబించింది. పవన్ను భ్రష్టు పట్టించడంలో టీడీపీ, ఈనాడు సక్సెస్ అయ్యాయి.
తాజాగా ఇద్దరు బీజేపీ జాతీయ నాయకుల ఇంటర్వ్యూలు ఈనాడులో ప్రచురించారు. వీరిలో సత్యకుమార్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయనకు పార్టీ అవసరమే తప్ప, సత్యకుమార్ వల్ల పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడదనే సత్యం పార్టీ శ్రేణులకు బాగా తెలుసు. సత్యకుమార్ పార్టీకి లాభం చేయకపోగా ఇలాంటి ఇంటర్వ్యూలతో నష్టం మాత్రమే చేస్తారని కచ్చితంగా చెప్పొచ్చు.
ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరితో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. బహుశా కుల గురువుపై గౌరవంతో కావచ్చు ... ఆ పత్రికతో పాటు టీడీపీ ఎజెండాకు అనుగుణంగా సంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇవ్వడాన్ని చూడొచ్చు. ‘రాజధాని అమరావతిలోనే ఉండాలి’ శీర్షికతో పురందేశ్వరి ఇంటర్వ్యూను ఇచ్చారు.
‘కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా పరిగణి స్తున్నా. సహచర నేతలతో కలిసి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తా’ అని పురందేశ్వరి వెల్లడించారు. బాధ్యతగా పరిగణించడం అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పడమా? కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించడమంటే టీడీపీ ఎజెండాను మోస్తూ ప్రజల్లో పార్టీని మరింత చులకన చేయడమా?... ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి.
బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా విషయంలో అప్రమత్తమయ్యారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని తమ అజెండాకు అనుగు ణంగా డిబేట్లు చేపట్టడాన్ని గుర్తించి, తమ ప్రతినిధులను వెళ్లొద్దని ఆదేశించిన విషయం పురందేశ్వరికి తెలియదా? పదవులకైతే పార్టీ కావాలి?.
ప్రయోజనాల విషయం వచ్చే సరికి కులం కావాలా? అని సోషల్ మీడియాలో ఏకిపారేయడం ఆమె దృష్టికి వెళ్లలేదా? ఇలాగైతే ఏపీలో పార్టీ బలోపేతం అటుంచి మరింత దిగజారిపోయే అవకాశం లేదా? అసలే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి జాతీయస్థాయి పదవి దక్కించుకున్న విషయం మరిచిపోతే ఎలా?
ఒకవైపు ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చని, అలాగే రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం హైకోర్టులో ఇప్పటికే మూడు అఫిడవిట్లు దాఖలు చేసింది. అలాగే సోము వీర్రాజు ఇటీవల పలు చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ తమకు అధికారం ఇస్తే రాజధాని సమస్యకు పరిష్కారం ఇస్తామని తెలివిగా సరికొత్త వాదన తెరపైకి తెస్తుంటే ... ఇప్పుడు జాతీయ స్థాయిలో పదవులు పొందిన ఆనందంలో అర్థంపర్థం లేకుండా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ మాట్లాడ్డం ఏంటి?
ఎవరి ప్రయోజనాల కోసం పదేపదే అదే మాటను పలుకుతున్నారు? ఇక కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లకు ఏం విలువ ఇచ్చినట్టు? మరి మిగిలిన ప్రాంతాల ఆకాంక్షలు, ఆశయాలేవీ పురందేశ్వరికి పట్టవా?
కుట్ర పూరిత ఉద్దేశంతో ఎల్లో మీడియా అమరావతి విషయంలో బీజేపీ నేతలను కమిట్ చేయించాలని పరితపిస్తోంది. అందుకు తగ్గట్టు పవన్కల్యాణ్, పురందేశ్వరి వ్యవహరిస్తూ సోషల్ మీడియాలోనూ, ఆ 29 మినహా మిగిలిన ప్రాంతాల ప్రజల కోపానికి గురి అవుతున్నారు. ఇంకా మున్ముందు ఈనాడు ట్రాప్లో ఎవరెవరు పడుతారో చూడాలి. ఈ లోపు ఏపీ బీజేపీ మేల్కొనకపోతే మాత్రం బీజేపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందమవుతుంది.