ఆయనకు వాట్సప్ కలెక్టర్గా పేరు. తమ సమస్యను తెలియజేస్తూ సదరు కలెక్టర్ వాట్సప్ నంబర్కు పంపితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇదంతా వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ... ఇది పచ్చి నిజం. వాట్సప్ మెసేజ్లకే స్పందిస్తూ ... హేట్సప్ అంటూ జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్న ఆ కలెక్టర్ పేరు హరికిరణ్. ప్రస్తుతం కడప కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హరికిరణ్ కరోనా బారిన పడ్డారు.
ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించారు. గత పది రోజులుగా తనను కలిసిన రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు , ఇతరత్రా మరెవరైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే మండల స్థాయి మొదలుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారుల మార్పులు జరిగింది. అయితే బదిలీకి నోచుకోని ఏకైక కలెక్టర్ హరికిరణ్ మాత్రమే. అందులోనూ సీఎం సొంత జిల్లాలో కలెక్టర్గా పని చేయడం అంటే కత్తి మీద సామే.
చంద్రబాబు హయాంలో ఈయన కడప కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే పార్టీలకు అతీతంగా , ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా హరికిరణ్ పని చేస్తారనే పేరు ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు రావడం విశేషం. దీంతో హరికిరణ్ను తన సొంత జిల్లా కలెక్టర్గా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి జగన్ మొగ్గు చూపారు.
సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా హరికిరణ్ కూడా మరింత బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారనే పేరు సంపాదించుకున్నారు. కరోనా బారిన పడిన కలెక్టర్ హరికిరణ్ త్వరగా కోలుకుని, తిరిగి యధావిధిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిద్దాం.