ఈనాడు రామోజీరావు పుణ్యమా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరితో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ, బాలకృష్ణ కూడా నెటిజన్ల ట్రోల్స్కు బలి కావాల్సి వచ్చింది. ఎల్లో మీడియాలో ఓ వార్త పతాక శీర్షికలెక్కిందంటే .... అది తప్ప కుండా చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల కాన్సెప్ట్ను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం కూడా తీసుకొచ్చింది. ఇక న్యాయస్థానాల్లో అడ్డంకులు తొలగితే విశాఖకు పరిపాలనా రాజధాని తక్షణం తరలి వెళ్లడమే తరువాయి. కాస్తా ఆలస్యంగానైనా న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలుకు హైకోర్టును తరలించడం ఖాయం.
ఈ నేపథ్యంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేయడంతో పాటు తమ వాదానికి అనుకూలమైన వాయిస్ను హైలెట్ చేస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
జాతీయ స్థాయిలో బీజేపీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడం, అందులో ఎన్టీఆర్ తనయ పురందేశ్వరికి స్థానం దక్కడం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురందేశ్వరిని ఈనాడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ... "అమరావతిలోనే రాజధాని ఉండాలనే" శీర్షికతో ఎల్లో పత్రికలో బ్యానర్ చేశారు. అయితే తన ఇంటర్వ్యూ చూసుకుని మురిసిపోతున్న పురందేశ్వరికి సోషల్ మీడియా షాక్ ఇచ్చింది.
ఈనాడులో వచ్చిన పురందేశ్వరి ఇంటర్వ్యూ క్లిప్పింగ్ను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా 2018లో బీజేపీ చేసిన రాయలసీమ డిక్లరేషన్ను కూడా షేర్ చేస్తూ ...భాజాపాది రెండు నాల్కల ధోరణి కాదా అంటూ నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరిపై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ ఏంటో చూద్దాం.
‘ఓహో ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాఖపట్నం కావాలి. గెలిచి మంత్రి పదవి పొందడానికి కాంగ్రెస్ కావాలి. అలాగే 2014లో ఎంపీగా పోటీ చేయడానికి రాయలసీమలోని రాజంపేట కావాలి. నాన్న ఎన్టీఆర్, అన్న హరికృష్ణ, తమ్ముడు బాలయ్యలకు పోటీ చేసి రాజకీయాల్లో రాణించడానికి రాయలసీమలోని తిరుపతి, హిందూపురం కావాలి. కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలి. ఎంత ‘కమ్మ’గా చెప్పావమ్మా తల్లి’ అని తీవ్రస్థాయిలో పురందేశ్వరిపై ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేనా, సోషల్ మీడియా వేదికగా ఆమెను గట్టిగా నిలదీస్తున్నారు.
‘హైకోర్ట్ ఎదురు దెబ్బలు సరే...ఆయా విషయాల మీద తమరి స్టాండ్ ఏందో చెప్పకూడదా? బీజేపీకి రెండు నాల్కల ధోరణి లేకుంటే ఈ రాయలసీమ డిక్లరేషన్ ఎవరిది? అందరూ రాష్ట్ర విభజన ఒప్పుకున్న తర్వాత చివరిగా కాంగ్రెస్ ఓకే చెప్పింది ... మరి కాంగ్రెస్లో ఏ తప్పు కనిపించిందని జంప్ చేసారో? మీ (పురందేశ్వరి) కెన్ని నాలుకలో?’ అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా 2018, ఫిబ్రవరి 23న బీజేపీ డిక్లరేషన్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. ఆ డిక్లరేషన్లో ఉన్న ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం.
1.ఆంధ్రప్రదేశ్ రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేపట్టాలి.
2.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయబడుతున్న తాత్కాలిక హైకోర్టు సైతం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి
3.అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కర్నాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.
4.సెక్రటేరియట్ మరిము తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి.
5.ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం
6.గవర్నర్ తాత్కాలిక విడిదికి నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి.
7.పరిపాలన సౌలభ్యం కోసం రాయలసీమను 8 జిల్లాలు చేయాలి.
ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలపై బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చేసింది. మరి ఈ డిక్లరేషన్పై ఏం చెబుతారని పురందేశ్వరిని నిలదీయడం గమనార్హం. మొత్తానికి టీడీపీ అజెండాకు అనుగుణంగా రామోజీ నేతృత్వంలోని ఈనాడు తనను ఇంటర్వ్యూ చేస్తోందన్న విషయాన్ని మరిచిన పురందేశ్వరి అత్యుత్సాహంతో ఏవేవో చెప్పుకుపోయారు. చివరికి ఆ మాటలే సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురి చేస్తున్నాయి.
అనవసరంగా తనతో పాటు తండ్రి, సోదరులను కూడా తిట్టించే పనికి రామోజీ స్కెచ్ వేశారని ... బహుశా ఇప్పుడు పురందేశ్వరికి అర్థమై ఉంటుందేమో!