అమరావతినిఏ ఏకైక రాజధానిగా ఉంచాలని జనసేన అభిప్రాయపడింది. ఆ పార్టీ దీని మీద తన స్టాండ్ ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు అందచేసింది. దీంతో విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో జనసేన తన భావనను కూడా తేల్చేసినట్లైంది.
విశాఖ వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలకు ముఖ ద్వారం. ఇక్కడ కనుక రాజధాని వస్తే రెడీ మేడ్ సిటీగా పెద్ద ఖర్చు లేకుండానే పాలన చేయవచ్చునని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలతో పాటు మరో వైపు గోదావరి జిల్లలు కూడా బాగుపడతాయని అంచనాలు ఉన్నాయి.
మరి విశాఖ అంటే తనకు ఇష్టమని పదే పదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నపుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారోనని మేధావులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ రాజధానిగా ఉంటే తప్పేంటన్న చర్చ కూడా ఉంది.
కేంద్రీకరణ అభివ్రుధ్ధి మూలంగా ఉమ్మడి ఏపీలో ఒకసారి దెబ్బతిన్న పరిస్థితి ఉందని, ఇపుడు వికేంద్రీకరణ దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తూంటే అడ్డుకోవడం భావ్యం కాదన్న మాట విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తున్న వారి నుంచి వస్తోంది.
మరి ఈ ప్రాంతంలో జనసైనికులు ఉన్నారు. వారు పవన్ నిర్ణయం మీద మౌనంగానే స్పందిస్తున్నారు తప్ప ఎక్కడా బయటపడడంలేదు. మొత్తానికి విశాఖ జనాలు మంచివారు వారికి ఏమీ అక్కరలేదు అన్న చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నారా అన్న చర్చ అయితే ఉంది.