రసవత్తరంగా సాగుతూ దేశం మొత్తాన్నీ తమ వైపుకు తిప్పుకుంటుంటాయి తమిళనాడు రాజకీయాలు. అనేక సందర్భాల్లో అవి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత ఆ వేడి తగ్గింది. గత కొన్నాళ్లుగా తమిళ రాజకీయాలు స్తబ్ధుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో శశికళ విడుదల అయితే.. అక్కడ రాజకీయాలు మళ్లీ వేడెక్కే అవకాశాలు ఉండనే ఉన్నాయి. దీంతో అమె విడుదల ఎప్పుడు? అనేది పక్క రాష్ట్రాల వారికి కూడా ఆసక్తిదాయకమైన అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆమె విడుదల గురించి ఏకంగా సమాచారహక్కు చట్టం ద్వారా కొందరు సమాచారాన్ని కోరారు. వారి కోరిక మేరకు పరప్పన అగ్రహార జైలు వారు సమాచారం ఇచ్చారు. పది కోట్ల రూపాయల ఫైన్ ను చెల్లిస్తే శశికళ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కావొచ్చని వారు ఇటీవలే సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శశి వచ్చేస్తోంది.. అనే వార్తలు ఊపందుకుంటున్నాయి. ఈ వార్తలు శశికళకే టెన్షన్ గా మారినట్టుగా ఉన్నాయి.
ఎట్టకేలకూ విడుదల కాబోతుండటం ఆమెకు ఊరటే, అయితే ముందుగానే విడుదల అంశం గురించి ప్రకటనలు వస్తే.. తన ప్రత్యర్థులు కొత్త చిక్కులు పెడతారేమో అనేది ఆమె భయం కావొచ్చు. ఒక కేసులో ఆమె దోషిగా నిర్ధారణ అయ్యి , శిక్షను అనుభవిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించో, వేరే కేసులకు సంబంధించో ఎవరైనా కొత్త లాజిక్కులు పట్టుకుని కోర్టుకు ఎక్కినా ఎక్కగలరు. అసలే తమిళనాట అలాంటి చిత్రవిచిత్రమైన పిటిషన్లు పడుతుంటాయి.
ఆ స్కామ్ లో జయలలిత కూడా దోషే కాబట్టి, ఆమె లేదు కాబట్టి.. ఆమె శిక్షను కూడా శశికళే అనుభవించాలంటూ పిటిషన్లు వేయగల ఘటనాఘట సమర్థులున్నారక్కడ. ఇలాంటి టెన్షన్లే శశికళకు మొదలైనట్టుగా ఉన్నాయి. అందుకే.. తన విడుదల గురించి ఎలాంటి సమాచారాన్నీ బయటకు ఇవ్వకూడదని ఆమె కోరినట్టుగా తెలుస్తోంది.
తన విడుదల గురించి ఎవరెవరో సమాచారాలు అడిగితే, ఎలా వారికి సమాచారాం ఇస్తున్నారంటూ ఆమె కర్ణాటక జైళ్ల శాఖకు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి కర్ణాటక జైళ్ల శాఖ ఏం సమాధానం ఇస్తుందో. ప్రస్తుతానికి బీజేపీ ఆశలూ మళ్లీ శశికళ మీదకే మళ్లినట్టుగా ఉన్నాయి.
ఆమె తప్ప తమిళనాట అన్నాడీఎంకే-తమ కూటమిని గట్టెక్కించగల వాళ్లు ఎవరూ లేరనే క్లారిటీకి ఆ పార్టీ కూడా భావిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే శశికళ మనిషి దినకరన్ ఢిల్లీకి వెళ్లి చర్చలు కూడా ప్రారంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అన్నాడీఎంకే తిరిగి శశికళ చేతికి వెళ్లేలా, దినకరన్ కు ప్రభుత్వ పదవి దక్కేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారని.. అలా బీజేపీ, అన్నాడీఎంకేలు పాత కాపురాన్నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టనున్నాయని వార్తలు వస్తున్నాయి.