ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా.. ఫర్నీచర్ తయారీ సంస్థలకు వివిధ రకాల రాయితీలకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి ఖరీదైన కలప దిగుమతులపై సుంకాలను తగ్గించి, దేశీయంగా ఫర్నీచర్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి సిద్ధమని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఫర్నీచర్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నెల్లూరు జిల్లాలో 1500 ఎకరాల పరిధిలో ఫర్నీచర్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టుగా, ప్రముఖ దేశీయ తయారీ సంస్థ గోద్రేజ్ ఈ విషయంలో ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఫర్నీచర్ పార్క్ వల్ల ఉత్పత్తి రంగానికి ఊతం లభిస్తుంది. అటు స్థానికంగా అవకాశాలు కూడా మెరుగవుతాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతియేటా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫర్నీచర్ క్రయవిక్రయాలు సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మన వాటాను పెంపొందించడానికి అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ రంగానికి ప్రోత్సహకాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీంతో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అవకాశాలు మెరుగయ్యాయి.
ఇప్పటికే గోద్రేజ్ వంటి సంస్థలు ఈ రంగంలో నాణ్యతతో పాటు, బ్రాండ్ గానూ పేరు పొందాయి. ఈ తయారీ రంగానికి ఏపీలో అవకాశం కల్పించడానికి ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వం స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తోంది. శ్రీసిటీకి సమీపంలో నెల్లూరు జిల్లా పరిధిలో ఈ ఫర్నీచర్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆహ్వానించదగిన అంశం ఇది.