ఆంధ్రప్రదేశ్కు మరో తీపి కబురు. 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే భారీ పరిశ్రమ ఏర్పాటుకు మోడీ సర్కార్ కొండంత చేయూతినిస్తోంది. ఈ పరిశ్రమ ఏర్పాటు చకాచకా జరిగితే మాత్రం జగన్ సర్కార్ పరపతి అమాంతం పెరుగుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనంతటికి మోడీ సర్కార్ చొరవే కారణమని చెప్పక తప్పదు.
మన దేశ ప్రజల అవసరాలతో పాటు ఎగుమతులే లక్ష్యంగా ఏపీలో భారీ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కోసం పరిశ్రమల శాఖ అధికారులు చురుగ్గా పని సంబంధిత పనులను చక్కబెడుతున్నారు.
ఇందుకోసం నెల్లూరు జిల్లాలోని శ్రీసిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి ఏడాది 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్ అమ్మకాలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాల అంచనా. ఈ బిజినెస్లో కనీసం రూ.3-4 లక్షల కోట్ల విలువైన మార్కెట్ను భారత్ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా.
శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఎగుమతులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై , కృష్ణపట్నం రేవుకు సమీపంలో శ్రీసిటీ ఉండడం వల్ల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నుంచి ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత స్థలాన్ని డీపీఐఐటీ అధికారులు పరిశీలించారు.
ఈ పార్కు ఏర్పాటులో ప్రముఖ దేశీయ ఫర్నిచర్ తయారీ సంస్థ గోద్రెజ్ ముందుకు రావడం విశేషం. అలాగే మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. శ్రీసిటీలో 25 క్షల మందికి ఉపాధి లభించే పరిశ్రమ ఏర్పాటైతే జగన్ సర్కార్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.
ఇటీవల కాలంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి కేంద్రీకరించారు. ఇందు కోసం పరిశ్రమలకు తగిన రాయితీలు, ఇతరత్రా ప్రయోజనాలు కల్పించేందుకు నిర్ణయించారు. జగన్ ఆలోచనలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుపై జగన్ సర్కార్ మరింత శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.