ఈ లాక్ డౌన్ లో సగటు భారతీయుడి ఖర్చు ఇది!

సుదీర్ఘంగా నెలల పాటు సాగిన లాక్ డౌన్ సగటు భారతీయ వినియోగదారుడి అలవాట్లను మార్చేసింది. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. నిత్యావసరాల్ని ఏ స్థాయిలో భద్రపరుచుకుంటున్నారు, వినోదం కోసం ఏం చేశారనే విషయం వాళ్ల ఖర్చులు చూస్తే అర్థమౌతుంది. ఈ కొత్త అలవాట్లు జనజీవనంలో పాతుకుపోయినట్టు కనిపిస్తున్న వేళ.. కొన్ని కంపెనీలు ఊహించని విధంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. 

ఈ లాక్ డౌన్ టైమ్ లో వినియోగదారులు ఎక్కువగా దృష్టిపెట్టిన కొన్ని ప్రొడక్ట్స్ చూద్దాం

ఇమ్యూనిటీ బూస్టర్స్
కరోనా దెబ్బకు ప్రపంచమంతా రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడింది. ఇండియాలో ఎక్కువ మంది పురాతన వైద్యమైన ఆయుర్వేదంపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా డాబర్, హిమాలయ సంస్థలు తయారుచేసిన చవన్ ప్రాష్ కు గిరాకీ బాగా పెరిగింది. దీంతో పాటు ఆయుర్వేద ఉత్పత్తులతో తయారుచేసిన సెప్టిలిన్ లాంటి మందులకు డిమాండ్ పెరిగింది.

నీల్సన్ హోల్డింగ్స్ అంచనా ప్రకారం ఇండియాలో ఒక్క జూన్ నెలలోనే చవన్ ప్రాష్ అమ్మకాలు అమాంతం 283 శాతం పెరిగాయి. ఇక బ్రాండెడ్ తేనె ఉత్పత్తుల అమ్మకాలు 39శాతం పెరిగాయి. దేశంలో అత్యథికంగా ఆయుర్వేద ఉత్పత్తుల్ని సరఫరా చేసే డాబర్ సంస్థ, తన కంపెనీకి చెందిన చవన్ ప్రాష్ అమ్మకాలు 700 శాతం (ఏప్రిల్-జూన్ మధ్య) పెరిగినట్టు ప్రకటించింది. 

మరికొన్ని నెలల పాటు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందని నీల్సన్ ఇండియా భావిస్తోంది. ప్రజలు ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులతో పాటు శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులపై ఖర్చు చేస్తున్నారని నీల్సన్ సౌత్-ఏసియాకు చెందిన వెస్ట్ మార్కెట్ లీడర్ సమీర్ శుక్లా చెబుతున్నారు. ఇలా ఖర్చు చేయడం ఇప్పట్లో ఆగదని కూడా అంచనా వేస్తున్నారు.

బ్రిక్ వర్క్ రేటింగ్స్ ప్రకారం ప్రకారం.. ఏప్రిల్-జూన్ మధ్య పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

కంఫర్ట్ ఫుడ్స్
మార్చి నుండి ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాల అమ్మకాలు పెరిగాయి, ఎందుకంటే ఇలాంటి ఉత్పత్తులు త్వరగా పాడవ్వవు. అందుకే మంచి బ్రాండ్స్ ను వినియోగదారులు ఎక్కువగా ఆదరించారు. యూరో మానిటర్ సర్వే ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ కోసం ఉపయోగించే తృణధాన్యాల ఉత్పత్తులు, ఇనిస్టెంట్ నూడిల్స్, రైస్, కుకింగ్ ఫ్యాట్స్ అమ్మకాలు జోరుగా సాగాయి. అయితే తగినంత నిల్వలు లేకపోవడంతో వీటి అమ్మకాల్లో హెచ్చుదల కనిపించలేదు.

మ్యాగీ, కిట్ కాట్, మంచ్ అమ్మకాలతో నెస్లే ఇండియా సంస్థ, మార్చి నాటికి 10.7 శాతం వృద్ధి చవిచూడగా.. ఏప్రిల్-మే నెలల్లో తమ బిస్కెట్స్ ద్వారా పార్లే సంస్థ అత్యథిక సేల్స్ నమోదుచేసింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎన్నో కుటుంబాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ పార్లే-జి బిస్కెట్లను ఇచ్చాయి. అలా ఈ సంస్థ కనివినీ ఎరుగని రీతిలో అమ్మకాలు జరిపింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో బ్రిటానియా సంస్థ కూడా తమ ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం.. కరోనా వల్ల రోడ్డు సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ కంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కే వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.

డిజిటల్ సర్వీసెస్
లాక్ డౌన్ వల్ల డిజిటల్ సర్వీసెస్ కు డిమాండ్ బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఎక్కువమంది విద్యార్థులు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ను ఉపయోగించడం ప్రారంభించారు. పిల్లలకు అందంగా పాఠాలు చెప్పే బైజూస్ కంపెనీ ఏప్రిల్-జూన్ మధ్య 3 రెట్లు వృద్ధి సాధించింది. కొత్త వినియోగదారుల్ని ఆకర్షించడం కోసం ఈ సంస్థ స్థానిక భాషల్లో ఆన్ లైన్ కోర్సులు ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. దీంతో పాటు మరిన్ని సబ్జెక్టులు కూడా పొందుపరచాలని చూస్తోంది.

ఆన్ లైన్ క్లాసుల వల్ల ల్యాప్ టాప్స్ వినియోగం భారీగా పెరిగింది. మార్చి నెలలో ల్యాప్ ట్యాప్ కోసం తమ సైట్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య రెట్టింపు అయిందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇక డిజిటల్ వినోద రంగానికి వస్తే జీ5 సంస్థ తమ రోజువారీ నెటిజన్ల శాతాన్ని 33శాతం పెంచుకుంది. ఇక మే నెలలో జీ5 యాప్ డౌన్ లోడ్స్ 45శాతం పెరిగాయి. ఇక ఇదే లాక్ డౌన్ టైమ్ లో రిషీకపూర్, సుశాంత్ సింగ్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటులు మరణించడంతో.. వాళ్ల సినిమాలు చూసేందుకు కూడా ఎక్కువమంది భారతీయులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వైపు వచ్చినట్టు అంచనా వేసింది జీ5.

గోల్డ్ లోన్స్
లాక్ డౌన్ వల్ల ఎక్కువమంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న పరిశ్రమలెన్నో మూతపడ్డాయి. ఇలాంటి వాళ్లతో పాటు చాలామంది పేదవాళ్లు గోల్డ్ లోన్స్ వైపు పరుగులుపెట్టారు. ప్రభుత్వ చేయూత అందని వాళ్లు, పేపర్ వర్క్ కు సూట్ అవ్వని వ్యాపారాలు చేస్తున్న వాళ్లు కూడా తమ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టారు. దీంతో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లాంటి సంస్థలు భారీగా వృద్ధిచెందాయి. ముత్తూట్ ఫైనాన్స్ ఓవరాల్ గా ఈ ఏడాది 57 శాతం వృద్ధిని నమోదుచేయగా.. ఈ లాక్ డౌన్ టైమ్ లో మణప్పురం గోల్డ్ సంస్థ 4.5శాతం వృద్ధి సాధించింది.

గృహోపకరణాలు
ఆర్థికంగా కాస్త భరించే స్థాయిలో ఉన్న భారతీయ వినియోగదారులు, కొత్త కొత్త గృహోపకరణాలపై ఎక్కువగా ఖర్చుచేశారు. జ్యూసర్లు, మిక్సర్లు, మైక్రో వొవెన్లు, టోస్టర్లు అమ్మకాలు జులైలో 4 రెట్లు పెరిగాయి. ఫ్లిప్ కార్ట్ ప్రకారం.. జులైలో వాక్యూమ్ క్లీనర్ల అమ్మకాలు 4 రెట్లు పెరిగాయి. ఇక డిష్ వాషర్ల విషయానికొస్తే.. ఐఎఫ్ బీ లాంటి సంస్థలు.. పెరిగిన డిమాండ్ ను తట్టుకోలేక కొత్త ఆర్డర్లు తీసుకోవడం మానేశాయి.

ఇక కరోనా వల్ల సెలూన్లు మూతపడ్డాయి. దీంతో నెలవారీ జరిగే ట్రిమ్మర్ల అమ్మకాలు 5 రెట్లు పెరిగినట్టు హెవెల్స్ సంస్థ ప్రకటించింది. ఇక ఫిలిప్స్ సంస్థ అయితే తమ గ్రూమింగ్ విభాగంలో మే-జూన్ మధ్య ఏకంగా 60 నుంచి 70శాతం వృద్ధిని నమోదుచేసింది.

దాదాపు నాలుగో వంతు భారతీయులు హోం కేర్ ఉత్పత్తులపై ఖర్చుచేయడానికి రెడీ అయ్యారు. మింటెల్ రీసెర్చ్ ప్రకారం.. 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు తన జీవనశైలిని పెంచుకునేందుకు ఎక్కువగా హోం కేర్ ఉత్పత్తులపై ఖర్చుచేశారు.

ఇలా ఈ లాక్ డౌన్ టైమ్ లో భారతీయుల సగటు జీవనశైలి కాస్త మారడంతో పాటు వాళ్లు ఖర్చు చేసే విధానంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

విజయవాడ వీధుల్లో తొడ కొట్టాను

Show comments