విశాఖ తమ్ముళ్ళు రాజీనామాకు రెడీనా?

ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు.  పచ్చ పార్టీ తమ్ముళ్ళ యవ్వారం చూస్తూంటే బయట వీలైనంతగా రచ్చ చేసి అందులోనే ఏదో గెలిచేశామనుకుని ఆత్మానందం పొందాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు ఏదో సవాల్ విసిరారుట. దాన్ని అర్జంటుగా వైసీపీ నేతలు స్వీకరించాలట. జగన్ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సిధ్ధం కావాలట. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతున్న సుద్ధులు.

ఆయన బాటలోనే జనంలో ఎపుడూ నిలిచి గెలవని టీడీపీ మ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు కూడా అసెంబ్లీ రద్దు అంటూ పాటపాడుతున్నారు. ఏడాది క్రిత్రం జరిగిన ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితం మొత్తంలో చూడనంత భారీ ఓటమిని పొందారు. దాదాపుగా ముప్పయి వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచేస్తామని ధైర్యం ఏమైనా అయ్యన్నకు ఇప్పటికిపుడు  వచ్చిందో లేదా  అసలు ఏపీలో  ఎందుకు ఎన్నికలు వస్తాయిలే  లాజిక్ లేని సవాలే కదా అని ఆయనకు ఆయనే నమ్మి ఇలా  వైసీపీని డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సరే జగన్ విషయానికే వస్తే సవాళ్ళు విసిరారో, తాను  ఎన్ని ఉప‌ ఎన్నికలు చూశారో  జనాలకు తెలిసిన విషయమే క‌దా. ఎప్పకపుడు  ఉప ఎన్నికలకు తొడగొట్టి మరీ  తన పార్టీని  నిలబెట్టి ఎలా  గెలిచారో పదేళ్ళ ఆయన రాజకీయం చూస్తే అర్ధమవుతుంది. అందువల్ల ఎపుడు ఎన్నికలు అన్నా వైసీపీకి కానీ, జగన్ కి కానీ ఎటువంటి భయం లేదన్నది ఏపీ ప్రజలకే  బాగా తెలుసు.

విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్లు ఉన్నారు. వారు విశాఖ రాజధాని ప్రకటన తరువాత   ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉంటూ వస్తున్నారు. మరి ఎన్నికలకు వారు సిధ్ధమో కాదో ముందు అయ్యన్న వారిని అడిగితే బెటరేమో. అంతే కాదు ముందు వారు తమ పదవులకు రాజీనామాలు చేసి అమరావతి నినాదం మీద విశాఖలో గెలిచే సత్తా ఉందో లేదో ఇంకా బాగా తెలుసుకుంటే కూడా అయ్యన్నకు మంచిదే.

మొత్తానికి  అయ్యన్న, చంద్రబాబు విసురుతున్న  సవాళ్ళు చూస్తూంటే నాది కాకపోతే కాశీ దాకా డేకుతాను అన్నట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. అర్ధం పర్ధం లేని సవాళ్ళు చేసి అధికార పార్టీ నేతలు  జవాబు చెప్పాలనడం ఒక్క పచ్చ తమ్ముళ్ళకే చెల్లిందిగా.

ఇలా చేస్తే కరోనా రాదు

కరోనా బారిన బాలు

Show comments