ఒకవేళ ఇదే పరిస్థితుల్లో ఒక కమ్మ సామాజికవర్గం నేత, ఆయన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి ఉంటే? జస్ట్.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! అచ్చెన్నాయుడిని ఒక పెద్ద స్కామ్ లో పోలీసులు అరెస్టు చేస్తేనే చంద్రబాబు నాయుడు అందులో కులం కోణం లాగారు. బీసీలను తమ ఓటు బ్యాంకుగా భావించి బీసీలపై దాడి అంటూ చంద్రబాబు నాయుడు రాజకీయం చేయబోయారు. అయితే ఆఖరికి బీసీ సంఘాలే స్పందించి, చెత్త రాజకీయానికి కులాన్ని ఆపాదించవద్దంటూ పిలుపునివ్వడంతో చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటున్నారు.
ఒకవేళ ఒక కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతను, ఆయన తనయుడిని ఇలా అరెస్టు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లకు రెస్టు లేకుండా పోయేది. రచ్చ రచ్చ చేసే వాళ్లు అనడంలో ఆశ్చర్యం లేదు. జగన్ మోహన్ రెడ్డి కమ్మ వాళ్లపై కక్ష సాధిస్తూ ఉన్నాడని, కమ్మ వాళ్లను అణగదొక్కుతూ ఉన్నాడని టీడీపీ వాళ్లు రచ్చ చేయడంతో పాటు.. సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో ఈ నినాదాలు మార్మోగేవి! కోడెల కుటుంబ అక్రమాలు బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్లు జగన్ పై ఎంతలా మాట్లాడారో, తమ కులం పై జగన్ దాడి చేస్తున్నారంటూ ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే.
కట్ చేస్తే.. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై టీడీపీ స్పందించింది. తమ పార్టీ పై జగన్ కక్ష సాధిస్తున్నారని, రీవేంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. అసలు రీవేంజ్ అనే మాటకు అర్థం తెలిస్తే చంద్రబాబు నాయుడు అలా మాట్లాడేవారు కాదేమో, జగన్ ప్రతీకారం తీర్చుకోవడం అనేది చంద్రబాబు ఉవాచ. ఇంతకీ ప్రతీకారం అంటే ఏమిటి? అది ప్రతిచర్యే కదా! చర్యకు ప్రతిచర్య ఉంటుంది. గతంలో తాము చర్య చేస్తే ఇప్పుడు ప్రతిచర్య వస్తోందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే తమ హయాంలో జగన్ ను వేధించినట్టు ఒప్పుకుంటున్నట్టే కదా!
ఆ సంగతలా ఉంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై అనంతపురం జిల్లా కమ్మ నేతలు కామ్ గా ఉన్నారు. ఒకరకంగా వారు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. లోకేష్ స్వయంగా పరామర్శకు అనంతపురం వచ్చి ఫుల్ విందు భోజనం తిని వెళ్లినా కమ్మ నేతలు మాత్రం రియాక్ట్ కాలేదు. జేసీ అరెస్టుకు వారు లోలోపల్ల చాలా ఆనంద పడి ఉండొచ్చు. పరిటాల కుటుంబం కానీ, పయ్యావుల కానీ, ప్రభాకర్ చౌదరి, హనుమంత రాయచౌదరి వంటి టీడీపీ నేతలు కానీ, మిగిలిన కమ్మ వాళ్లు కానీ ప్రభాకర్ రెడ్డి , అస్మిత్ ల అరెస్టుపై ప్రకటనల ద్వారా కూడా నిరసనలు వ్యక్తం చేయలేదు!
అదే ఎవరైనా కమ్మ సామాజికవర్గం టీడీపీ నేతను అరెస్టు చేసి ఉంటే వీళ్లంతా ఊగిపోయే వారు కాదా? ఏతావాతా జేసీ దివాకర్ రెడ్డి అరెస్టును టీడీపీలోని కమ్మ నేతలు ఆస్వాధిస్తూ ఉన్నారని, చంద్రబాబు కూడా లోకేష్ దింపి కామెడీ చేయిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జేసీ ఫ్యామిలీకి కూడా ఇదో గుణపాఠం అని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ సామాజికవర్గాన్ని అవమానించేలా కూడా మాట్లాడి వారు సొంత సామాజికవర్గం చేతే తిరస్కరణ పొందారని, ఇప్పుడు టీడీపీ అసలు స్వరూపం వాళ్లకు మరింతగా అర్థం అవుతూ ఉందని రాయలసీమ స్థానికులు అనుకుంటున్నారు.