హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు పిల్లనిచ్చిన మామ నందమూరి బాలకృష్ణపై జాలి చూపాల్సిన సమయమిది. ఆయన మాటలు వింటే...లాక్డౌన్ ఒంటరితనం ఆయన మనసుపై బాగా ప్రభావం చూపినట్టు అర్థమవుతోంది. అసలు తానేం మాట్లాడుతున్నారో బాలకృష్ణకే తెలియని దుస్థితి.
మహానాడులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. అంతటితో ఆగకుండా, ఏకంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ ధీమాగా చెప్పుకొచ్చారు.
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎన్టీఆర్ వారసులు తాము కాదని, కార్యకర్తలే నిజమైన వారసులని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. మహా నాడులో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న బాలకృష్ణ తానేమైనా సినిమా షూటింగ్లో ఉన్నాననుకుంటున్నారా? లేక సినిమాల్లో పంచ్ డైలాగ్లు అనుకున్నారా? జగన్ సర్కార్ ఐదేళ్ల పాటు ఉండదని కనీసం హాస్యానికైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శించవు. అలాంటిది బాలకృష్ణ విచక్షణ లేకుండా మాట్లాడుతున్న తీరుకు పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.
టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ప్రాతిపదిక ఏంటో బాలకృష్ణనే చెప్పాలి. ఇలా తలాతోకా లేని మాటలు మాట్లాడ్డం వల్లే ప్రజల్లో టీడీపీ రోజురోజుకూ అభాసుపాలవుతోంది. ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో తెలిసి...నేడు తగుదునమ్మా అంటూ ఆ మహనీయుడి కలలను బాబు సాకారం చేస్తున్నారని బాలకృష్ణ అంటున్నారంటే...ఆయన గురించి ఎవరైనా ఏం ఊహించుకుం టారో వారి వారి సృజనాత్మకతపై ఆధారపడి ఉంటుంది.
ప్రతిరోజూ వార్తల్లో వ్యక్తిగా నిలబడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అర్థంపర్థం లేని ట్వీట్లు చేస్తుంటారు. ఇప్పుడు బాలకృష్ణ మాటలు కూడా అలాంటివే. మొత్తానికి అల్లునికి తగ్గ మామ బాలకృష్ణ అని నిరూపించుకున్నారు. బాలకృష్ణపై జాలి చూపడం తప్ప మరేం చేయగలం!