భారత్ లో 4500 దాటిన కరోనా మృతులు

ఇండియాలో కరోనా మృతుల సంఖ్య తాజాగా 4500 మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 194 మంది కరోనా వల్ల మరణించారు. దేశంలో ఒక రోజు సంభవించిన మరణాల్లో అత్యథికం ఇదే. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4531కు చేరింది.

అటు కొత్త కేసుల నమోదులో కూడా దేశం దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే 6566 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,58,333కు చేరుకుంది. ప్రస్తుతం టాప్-10 కరోనా దేశాల జాబితాలో ఇండియా 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇదే రేంజ్ లో రేపు కూడా కరోనా కేసులు నమోదైతే... టర్కీని (1,59,797) అధిగమించి 9వ స్థానానికి ఎగబాకుతుంది ఇండియా.

ఇక రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే.. మహారాష్ట్రంలో నిన్న కొత్తగా మరో 2190 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 56,984కు చేరుకుంది. నిన్నటి వరకు మహారాష్ట్రలో 1897 మంది మృత్యువాతపడగా.. దాదాపు 18వేల మంది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో తమిళనాట కొత్తగా 817 కేసులు ఢిల్లీలో 792 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 18,545కు, ఢిల్లీలో 15,257కు చేరుకుంది.  అటు ఢిల్లీలో మరణాల సంఖ్య 3వందల మార్క్ దాటగా.. గుజరాత్ లో ఇప్పటివరకు 938 మంది మరణించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 67,692 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 86,110 మందికి చికిత్స జరుగుతోంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో కొనసాగుతున్నాయి.

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments